తుఫానులో మహావృక్షాలు వేళ్ళతో సహా పెకలించుకుపోతాయి. కట్టడాలు కూలిపోతాయి. కానీ ఎంత పెద్ద తుఫానైనా ఒక గడ్డిపోచను ఏమీ చేయలేదు. పిల్లలారా, అణకువ యొక్క మహత్వమిదే.

ఇతరుల ముందు తల వంచడమనేది దుర్బలత కాదు. ఒక గడ్డిపోచ ముందు కూడా తల వంచగలిగే ఔన్నత్యము మనలో పెంపొందాలి. ఒకడు స్నానం చేయడానికి నదిలోకి దిగి, ‘నేను నదికి తల వంచను, నేను మునగను’ అని అంటే అతడి శరీరంలోని మలినాలు పోవు. ఆధ్యాత్మిక జీవి ఇతరుల ముందు తల వంచను అని చెప్పటము వలన అతడజ్ఞానమే నశించదు.

ప్రపంచాన్ని మొత్తము భస్మీకరించడానికి ఒక్క మీట నొక్కితే చాలు అని చెప్పి మనిషి అహంకరిస్తున్నాడు. మీట నొక్కాలంటే చెయ్యి చలించాలి. దానికి కారణమైన శక్తిని గురించి అతడు ఆలోచించట్లేదు.

ప్రపంచాన్ని జయించానని మనిషి అంటున్నాడు. అతడు తన ఆరికాలి క్రింద ఉన్న ఇసుక రేణువులను కూడా లెక్కించలేడు. అటువంటి అల్పులు ప్రపంచాన్ని జయించామని అంటున్నారు.

ఊరికే నడిచి వస్తున్న సమయాన ఒకతను మనపై కోపగించాడనుకోండి. ఆ సమయంలో కూడా ‘ఇది నన్ను పరీక్షించటం కోసమే భగవంతుడి లీల’ అని తెలుసుకొని, కోపగించుకున్నవాడికి నమస్కరించే భావము సాధకుడు పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే ధ్యానము యొక్క ఫలము పొందినట్లుగా చెప్పవచ్చు.

పిల్లలారా, మొదలంటా నరికి తనను నాశనము చేస్తున్న సమయములో కూడా, నరుకుతున్నవాడికి వృక్షము నీడనిస్తుంది. ఆధ్యాత్మిక జీవి కూడా ఇదే విధంగా ఉండాలి. తనను బాధిస్తున్న వారికి కూడా మంచి జరగాలని కోరుకునే వాడు మాత్రమే ఆధ్యాత్మిక జీవి అవ్వగలడు.

పిల్లలారా, సహనము కలవాడికి మాత్రమే ఆధ్యాత్మిక జీవితము సాధ్యము.

బాహ్యాచారాలను మాత్రం చూసి ఒకరి ఆధ్యాత్మికోన్నతిని కొలవటము సాధ్యం కాదు. ఒక సాధకుడు ప్రతికూల పరిస్థితులలో ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అన్నదాని ఆధారంగా అతడి ఆధ్యాత్మిక పురోగతిని కొంతవరకు అర్థము చేసుకోవచ్చు.

చిన్న విషయానికి కూడా కోపించేవాడు లోకానికి దారెలా చూపగలడు? పిల్లలారా, సహనము ఉన్నవాడు మాత్రమే ఇతరులకు దారి చూపగలడు. అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ఒక కుర్చీలో ఎంతమంది కూర్చున్నా అది ఫిర్యాదు చేయదు. అదే విధంగా, ఎంతమంది మనల్ని ద్వేషించినా వారిని సహించి మన్నించగలిగే శక్తిని ఆర్జించాలి. లేకపోతే సాధన చేయటం వలన ఏ ఫలితముండదు.

కోపము వలన సాధన ద్వారా ఆర్జించిన ఎంతో శక్తి నష్టమౌతుంది. వాహనాన్ని నడిపించేటపుడు ఎక్కువ శక్తి నష్టమవ్వదు. ఆపేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడే ఎక్కువ ఇంధనము ఖర్చవుతుంది. అదే విధంగా, కోపగించుకోవడము వలన ప్రతి రోమకూపము నుండీ శక్తి నష్టమౌతుంది.

ఒక సిగరెట్ లైటరును పది, ఇరవై సార్లు నొక్కినప్పుడు దాంట్లోని పెట్రోలు నష్టమౌతుంది. అయితే అది మనకు కనపడటము లేదు. కానీ తెలుసుకోగలుగుతున్నాము. అదే విధంగా, సత్‍చింతనల ద్వారా సంపాదించిన శక్తి కూడా అనేక కారణాల వలన నష్టమౌతున్నది. అదే విధంగా, కోపము వచ్చినప్పుడు సాధన ద్వారా ఎంత సంపాదించామో అదంతా నష్టపోతాము. మాట్లాడినప్పుడు నోటి ద్వారా మాత్రమే జీవశక్తి నష్టమౌతున్నది. కోపము వచ్చినప్పుడు కళ్ళు, చెవులు నుండే కాక సకల ద్వారాల నుండీ జీవశక్తి నష్టమౌతుంది.

పిల్లలారా, ఒక ఆధ్యాత్మిక సాధకుడికి సమయపాలనలో నిష్ఠ తప్పకుండా అవసరము. రోజూ ఈ ఈ సమయాలలో, ఇన్ని గంటల పాటు జపధ్యానాలు చేయాలి అని ఒక సమయపాలనా పట్టిక అవసరము. నిర్ణీత సమయములో సాధనలు చేయాలి అనే స్వభావాన్ని పెంపొందించుకోవాలి. ఈ స్వభావమే మనల్ని పురోగమింపచేస్తుంది.

సాధనాక్రమాలలో సమయపాలన నిష్ఠగా పాటించేవాడు  ఆ ఆ సమయాలలో వాటిలోనే నిమగ్నమవుతాడు. టీ త్రాగటానికి అలవాటు పడ్డవాడు ఆ నిర్ణీత సమయానికి టీ త్రాగవలసిందే. లేకపోతే, అతడు అశాంతికి లోనవుతాడు. అతడు టీ కోసము పరుగెడతాడు.

పిల్లలారా, సముద్రపు అలలను నిరోధించడానికి తీరమున్నది. ఆధ్యాత్మిక జీవితంలో, మనస్సు యొక్క అలలను నిరోధించేది వ్రతాచరణలే.

ఏకాదశి, పౌర్ణమి మొదలైన దినాలలో వాతావరణం పూర్తిగా కలుషితమై ఉంటుంది. ఈ రోజులలో పండ్లు మాత్రమే భుజించి, మౌనవ్రతము ఆచరించటం మంచిది. పండ్లు తోలుతో కప్పబడి ఉండటం వలన వాతావరణ కాలుష్యం వాటిపై అంతగా ప్రభావం చూపదు. ఈ రోజులు సాధనకు ఎంతో అనుకూలమైనవి. అప్పుడు, మన ఆలోచనలేవైనా; ఆధ్యాత్మికము కానీ, భౌతికము కానీ, వాటిలో మరింత ఏకాగ్రతను పొందవచ్చు.

నెలకు కనీసం రెండు సార్లైనా జీర్ణకోశాన్ని శుభ్రము చేయటానికి విరేచనాల మందు తీసుకోవటము సాధకునికి మంచిది. వారంలో ఒక రోజు పండ్లు మాత్రమే భుజించి, మౌనవ్రతముతో జపధ్యానాలు చేయాలి. ఇది శరీరానికీ సాధనకీ మేలు చేస్తుంది.

నిరంతర సాధనే వ్రతంగా ఆచరించేవారికి, నిరాహార వ్రతములు మొదలైనవి ఆచరించటం వలన వారి మనస్సు, శరీరము వారి ధ్యానానికి అనుకూలమయ్యి తీరుతాయి. కానీ, సాధనతో పాటు వేరే పనులు కూడా చేసేవారు సంపూర్ణ ఉపవాసాలు ఆచరించకూడదు. వారు అవసరమైనంత ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు ఉత్తమమైనవి.

పని చేసి సంపాదించిన డబ్బు మొత్తం, తరువాతి నిమిషంలో వేరుశనగలు కొనటానికి ఖర్చు పెట్టటం లాంటిది ధ్యానము చేసిన వెంటనే మాట్లాడటము. ధ్యానము ద్వారా ఆర్జించిన శక్తంతా నష్టమవుతుంది.

సాధకుడు ప్రతి మాటనూ శ్రద్ధతో జాగ్రత్తగా పలకాలి. అతడి సంభాషణ ఎంతో మృదువుగా ఉండాలి. వింటున్నవారు తమ మనస్సునూ, ఇంద్రియాలనూ ఎంతో ఏకాగ్రతతో నియంత్రించితే మాత్రమే వినగలిగే విధంగా అతడు మాట్లాడాలి.

పిల్లలారా, వ్యాధి నయమవ్వాలంటే రోగి పథ్యం పాటించాలి. లక్ష్యాన్ని చేరేవరకు సాధకుడికి కూడా పథ్యం ఆవశ్యము. మాట్లాడటము తగ్గించుట, మౌనవ్రతము ఆచరించుట, ఆహారము నియంత్రించుట మొదలైనవి సాధకుడికి పథ్యం.

ఈ వ్రతాచరణలేవీ దుర్బలత కాదు. పడవను నిర్మించడానికి కలప తీసుకుంటే అది వంపు తిరిగి ఉంటేనే ప్రయోజనముంటుంది. చెక్కని వంచడానికి, దానిని వేడి చేస్తారు. ఇదే విధంగా, వ్రతాచరణల ద్వారా మనస్సును వంచి, స్వాధీనములోకి తెచ్చుకోవటానికి సాధ్యమవుతుంది. మనస్సును లొంగదీయకుండా శరీరాన్ని నియంత్రణలోకి తెచ్చుకోలేము.

పిల్లలారా, గుర్రపుడెక్కతో మూసుకుపోయిన నీటిలో పడవ నడపటము ప్రయాసమే. గుర్రపుడెక్కను తొలగించినాక పడవ వేగంగా ముందుకు వెళ్తుంది. అదే విధంగా, మనోమాలిన్యాలను జపముతో తొలగించితే ధ్యానము వేగవంతమవుతుంది.

ప్రాణాయమము సరిగా చేయకపోతే ఎంత ప్రమాదకరమో అలాంటిదే శ్రద్ధ లేకుండా నిరంతర జపము చేయటము. జపము చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వేరే ఆలోచనలను దూరంగా ఉంచాలి. రూపములోనో, మంత్రాక్షరములలోనో మనస్సుని ఏకాగ్రము చేయటానికి జాగ్రత్త తీసుకోవాలి.

పిల్లలారా, మంత్రము సదా జపించాలి. విశ్రమము లేకుండా జపించటము మనస్సుకు నేర్పించాలి. తరువాత ఏ పని చేస్తున్నప్పుడైనా మనస్సు జపమును కొనసాగిస్తుంది. సాలీడులు ఎక్కడికి వెళ్ళినా గూడు అల్లుతూనే ఉంటాయి. ఇదే విధంగా, ఏ పని చేస్తున్నప్పుడైనా మనస్సులో జపము కొనసాగించాలి.

పిల్లికి ఎంత ఆహారము పెట్టి లాలించి పెంచినా మనము అశ్రద్ధగా ఉంటే అది దొంగిలిస్తుంది. పిల్లలారా, ఇదే విధంగా మనస్సు కూడా. ఆ విధంగా ఉన్న మనస్సుని లొంగదీసుకోవటానికీ – ఏకాగ్రము చేయడానికీ మంత్రము సదా జపించాలి. నడుస్తున్నప్పుడూ కూర్చున్నప్పుడూ పని చేస్తున్నప్పుడూ అన్ని సమయాలలో మంత్రజపము తైలధారలాగా కొనసాగాలి.

పిల్లలారా, సాధన యొక్క మొదటి దశలలో రూపస్మరణతో పాటు జపము కూడా అవసరమే. రూపము స్పష్టంగా లేనట్లైతే, దాని గూర్చి చింతించవద్దు, జపము కొనసాగిస్తే చాలు. సాధనలో పురోగమిస్తున్న కొద్దీ రూపములో మనస్సు స్థిరమవుతుంది. జపము తనంతట తానే నిదానమౌతుంది.

కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. పిల్లలారా, ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు.

పిల్లలారా, పలు సహస్రనామాలను జపించవలసిన అవసరము లేదు. ఏదో ఒక్కటి చాలు. ఒక్క దానిలోనే అంతా ఉంది.

సంధ్యా సమయములో ప్రకృతి, కలుషితమైన తరంగాలతో నిండి ఉంటుంది. పగలూ రాత్రీ కలసి సమ్మేళనమవుతున్న సమయమే సంధ్య. అయితే, సాధకుడికి ధ్యానము చెయ్యటానికి ఇది తగిన సమయము. ఈ సమయములో సరైన ఏకాగ్రత పొందవచ్చు. సాధన చెయ్యకపోతే లౌకికమైన ఆలోచనలు ఎక్కువయ్యి పైకి వస్తాయి. అందుకే, సంధ్యా సమయములో  కీర్తనలు బిగ్గరగా పాడాలని చెప్తారు. దీని వలన వాతావరణము కూడా శుద్ధి అవుతుంది.

వాతావరణము శబ్దకోలాహలములతో నిండి ఉండుట వలన కలికాలములో ఏకాగ్రత పొందటానికి ధ్యానము కన్నా ఉత్తమమైనది కీర్తనమే. ధ్యానానికి నిశ్శబ్దమైన వాతావరణం అవసరము. బిగ్గరగా కీర్తనలు పాడటము ద్వారా ఇతర శబ్దాలను జయించగలము కదా? ఏకాగ్రతకు అవతల ఒకటున్నది. అదే ధ్యానము. కీర్తనము – ఏకాగ్రత – ధ్యానము, ఇదే క్రమము. పిల్లలారా, నిరాటంకమైన భగవదాలోచనే ధ్యానము.

ఏకాగ్రతతో కీర్తనలు పాడకపోయినట్లైతే జీవశక్తి వృధా అవ్వటము తప్పించి ఇతర ప్రయోజనమేమీ లేదు. ఏకాగ్రతతో పాడితే; పాడినవారికి మేలు, వారి ఏకాగ్రత వలన ప్రకృతికి కూడా మేలు కలుగుతుంది. పైగా విన్నవారికి కూడా మేలు కలుగుతుంది. తరువాత ఈ కీర్తనలు వారి మనస్సును మేల్కొల్పడానికి సహాయము చేస్తాయి.

పిల్లలారా, మనస్సు చంచలంగా అనిపిస్తే మంత్రము జపించాలి, లేకపోతే చంచలత్వం అధికమవుతుంది. నిశ్చలత దొరకని మనస్సు దానిని తిరిగి పొందటానికి వేరొకదానిని ఆశ్రయిస్తుంది. దాని వలన కూడా ఫలితము దొరకనప్పుడు, మరొకదానిని ఆశ్రయిస్తుంది. ఈ బాహ్యవస్తువులలో దేనికీ నిశ్చలత ఇవ్వటము సాధ్యము కాదు. కానీ భగవంతుని స్మరణమూ, మంత్ర జపమూ చేస్తే నిశ్చలత్వం తిరిగి పొందటం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక గ్రంథ పారాయణము కూడా మంచిదే.

చిన్నపిల్లలు పూసల పలక ఉపయోగించి అంకెలు లెక్కబెట్టటము నేర్చుకుంటారు. దీని ద్వారా వాళ్ళు త్వరగా అంకెలు నేర్చుకోగలుగుతారు. అదే విధంగా, మొదట్లో మనస్సును మన అధీనములో ఉంచుకోవటానికి జపమాలను ఉపయోగించటము మంచిది. తరువాత, మాల లేకుండా కూడా జపము చేయవచ్చు. జపము నిరంతరంగా చేస్తే, అది స్వభావము అయ్యి తీరుతుంది. నిద్రపోతున్న సమయములో కూడా మనకు తెలియకుండానే జపము కొనసాగుతూ ఉంటుంది.

పిల్లలారా, సాయంసంధ్య వేళలో వెలుగుతున్న నూనె దీపము ముందు కూర్చుని కీర్తనలు పాడటము మంచిది. నూనెలో కాలిన వత్తి నుండి వచ్చిన పొగ ఒక సిద్ధౌషధము. ఆ పొగ మన శరీరాన్ని మరియు వాతావరణాన్ని కూడా పరిశుద్ధం చేస్తుంది.