21 జూలై 2015, పారిస్ , ఫ్రాన్స్ లో జరిగిన Climatic Conscience శిఖాగ్రసమావేశానికి పంపిన అమ్మయొక్క వీడియో సందేశము.
ప్రేమ స్వరూపులు ఆత్మస్వరూపులు అయిన అందరికీ నమస్కారములు.
కొంతమంది పిల్లలు అంటారు “అమ్మా, తల తిరుగుతోంది, పడిపోతున్నాను, కుదురు తప్పుతోంది” అని అంటారు. దానికి కారణం చెవులలోని కణములకు స్థానచలనం కలిగి అలజడి వల్ల ఇలా జరుగుతోంది. నేడు మన ప్రకృతికి కలిగిన భంగపాటు ఇంచుమించు ఇలాంటిదే. అందు వల్ల ఒక తుపాకికి ముందు నిల్చున్నప్పుడు కలిగే జాగరూకత, ఎఱుక మనకు ఉండాలి.

నా చిన్న తనంలో జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను.
నేను ఒక పేద బేస్త గ్రామంలో పెరిగాను. అక్కడ జనం రోజువారి వేతనాల మీద జీవించేవారు. ప్రతిరోజూ మూడు పూటలా తినటానికి ఉండేది కాదు. నేను ఇంటి ఆవులకు ఆహార వ్యర్థాలను ఇవ్వటానికి ఇరుగు పొరుగు ఇళ్ళకు వెళ్ళి ఆహార వ్యర్థాలను సేకరించేదానిని. ఒక రోజు దీని కొరకు నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ పదకొండుమంది పిల్లలున్నారు. వారందరూ తల్లి ఒడిలో వాలి ఉన్నారు.
అప్పుడా తల్లి “ నిన్న ఏమీ వండలేదు అందువల్ల కాయకూరల తొక్కులేమీ లేవు అమ్మాయి” అని నాతో అన్నారు.
అప్పుడు నేను అడిగాను, “ఎవరివద్ద అయినా అప్పు తీసుకుని పిల్లలకు వండిపెట్ట కూడదా ?”
ఆమె అన్నది, “పిల్లల తండ్రి పనికి వెళ్ళి, ఏమీ దొరకకుండా తిరిగి వచ్చారు. దాని తరువాత పది కిలోమీటర్ల దూరాన ఉన్న బంధువుల ఇంటికి డబ్బు అప్పు అడగటానికి నడిచి వెళ్ళారు. కానీ గిట్టలేదు. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అయింది. పౌర్ణమి రాత్రి అవటం వల్ల సముద్రతీరాన వస్తున్నప్పుడు తాబేలు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టడం చూసారు. తాబేలు గుడ్లు పెట్టి తిరిగి పోయిన తరువాత, కొన్ని గుడ్లను తీసుకెళ్లి ఉడికించి, రెండు మూడు గుడ్లు చొప్పున పిల్లలకు పంచిపెట్టారు.”
అప్పుడు వారిలో ఒక అబ్బాయి అడిగాడు, “ గుడ్లన్నిటినీ ఎందుకు తీసుకురాలేదు నాన్నా ? అప్పుడు ఎక్కువ తినగలిగేవారము కదా.”
అప్పుడు ఆ తండ్రి అబ్బాయితో అన్నడు “అబ్బాయి, మీరందరూ చనిపోతే నేను ఎంత బాధపడతాను. అన్ని గుడ్లను తీసుకువెళితే, తాబేలుకూడా అలాగే బాధ పడుతుంది. అంతే కాదు దాని పరంపర కొనసాగితేనే కదా, మనకు ఆకలి తీరని సందర్భాలలో కొంచమైనా దొరికేది.”
ఇక్కడ మనం గమనించగలిగేది ఏమిటంటే తాను ఆకలితో ఉన్నప్పటికీ, ఇతరుల బాధను గుర్తించగలుగుతున్నాడు. తాను బాధ పడుతున్నప్పటికీ, ఇతరుల పట్ల కారుణ్యమును చూపించగలుగుతున్నాడు. అలాటి మనోభావమే మన పూర్వీకులకు ఉండేది. కానీ ఇప్పుడు, తాబేలునూ అన్నిటినీ ధనార్జనే లక్ష్యంగా ఎగుమతి చేస్తున్నాము.

నేడు మానవుడు ఒక చెట్టును నరికినప్పుడు, తన శవపేటికను తానే తయారుచేసుకుంటున్నాడు. చెట్లను అమితముగా నరికేశాము. ఇలాంటప్పుడు ఒక చెట్టును నరికేసి, ఇంకొక మొక్కను నాటితే సరిపోదు. ఇలాంటి స్థితిలో కనీసం నలభై యాభై చెట్లనైనా నాటాలి. నేడు పర్యావరణ కాలుష్యమువల్ల ఐదు లక్షలమందికి పైగా క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.

పూర్వపు రోజులలో, మాకు గాయం ఏర్పడితే, ఆవుపేడను పెట్టి గాయాన్ని నయంచేసేవారు. కానీ ఇప్పుడు గాయానికి పేడ సోకితే సెప్టిక్ అవుతోంది. ఆరోజులలో ఔషధముగా ఉండినది ఇప్పుడు విషముగా మారింది.

ప్రపంచంలో ఏదికూడా నిస్సారమైనది కాదు. ఒక విమానము యొక్క ఇంజిన్ పనిచేయకపోయినా ఎగరలేదు. స్క్రూ లేక పోయినా ఎగరలేదు. అన్నిటికీ దానికంటూ ఒక స్థానముంది. తేనెటీగలు పుష్పసంపర్కం చేయటం వల్లనే మనకు పండ్లు కాయకూరలు దొరుకుతున్నాయి. ఆ తేనెటీగలు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలిగేవి. కానీ ఇప్పుడు, పువ్వులకు ఎక్కువగా విష మందులు జల్లటం వల్ల, వాటి జ్ఞాపక శక్తి నశించి తిరిగి తమ తేనెగూడ్లకు తిరిగి రాలేకపోతున్నాయి. అందువల్ల పూల చెట్లు, తేనెటీగల గూడ్లు, హెచ్చుసంఖ్యలో కావాలి. లక్షలకొద్ది అమ్మ పిల్లలు ఇలా చేస్తున్నారు. ఐనప్పటికీ, ఇంకా అధికంగా తేనెటీగల గూడ్లను, పూలచెట్లను, పెంచడానికి చాలామంది శ్రద్దతో పూనుకోవాలి.

మనలను కన్న తల్లి ఐదు ఏళ్ళ వరకే ఒడిలో కూర్చోపెట్టుకుంటుంది. భూమాత అలా కాదు. జీవితాంతము తొక్కటానికీ, ఉమ్మటానికి , గుద్దటానికి అనుమతించిన తల్లి. జీవితకాలంమంతయు మనలను పోషించి పెంచుతున్న అమ్మ. అన్నిటికీ పోషక శక్తి అయిన అమ్మ. ఆ అమ్మ పట్ల ఉన్న బాధ్యతను మనం మరచిపోకూడదు.
ఒక భవనముయొక్క మొదటి అంతస్తు కాలినప్పుడు, “ అయ్యో, కాపాడండి, రక్షించండి.” అని ఇలా విన్న కేకలకు, పదో అంతస్తున ఉన్న మనిషి “ అది అతని సమస్య. నా సమస్య కాదు, అని అనుకుంటే చివరికి అది తన సమస్యగా మారుతుంది. దీనిని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. నేటి అతని సమస్యే రేపటి నా సమస్యగా మారుతుందనే వివేకం మనలో కలిగి, మనం మారాలి.

ప్రపంచమునకు ఒక లయ ఉంది. ఈ విశ్వానికి దానిలోని జీవరాశులకు మద్య అభేద్యమైన బంధం ఉంది. పరస్పరాలంబనము ఉన్న నెట్వర్క్ లాంటిది ఈ ప్రపంచము. నాలుగుమంది కలిసి పట్టుకున్న ఒక వలలో చలనం సంభవించినప్పుడు అది అన్ని చోట్లా ప్రతిధ్వనిస్తుంది. అందుచేత మనం తెలిసో తెలియకో, ఒంటరిగానో సమూహముగానో చేసే అన్ని కర్మలూ, ప్రపంచము అన్న వలయొక్క నలుమూలలా ప్రతిధ్వనిస్తుంది. వారు మారిన తరువాత నేను మారుతాను అని అనుకుంటే సరిపోదు. వారు మారకపోయినా మనం మారితే వారిలోనూ మార్పును తీసుకురావచ్చు. మొదట మనం ఏమి చెయ్యగలము అని చూడాలి.
మదర్స్ డే అలగే ఫాదర్స్ డే చాలా ఆడంబరముగా జరుపుకున్నట్లు ప్రకృతిని ఆదరించటానికి , ఆరాధించటానికీ మనకు ఒక రోజు ఉండాలి. ఆరోజు ప్రపంచంలోని అందరూ ఖచ్చితంగా చెట్ల మొలకలను నాటాలి.

ఇంతకు ముందు ఇల్లు కట్టుకున్నవారు, ఇంకొక ఇల్లు 3000 చ. అడుగులులో కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, 1500 చ. అడుగులులో ఇల్లు కట్టుకోవాలి. రెండువేల చ. అడుగులులో ఇల్లు కట్టుకోవలని అనుకున్నవారు వెయ్యి చ. అడుగులులో కట్టుకోవటానికి ప్రయత్నించాలి. వెయ్యి చ. అడుగులులో కట్టాలని అనుకున్నవారు ఐదు వందల చ. అడుగులులో కట్టాలి. ఇలా చేయటం వల్ల మనం చెట్లను, నీళ్ళను, విద్యుత్ శక్తిని ఇతర వనరులను పొదుపుచేయవచ్చు . అన్ని చెట్లను మనం నరకనక్కర్లేదు.

car pooling ద్వారా మనం ఇంధనమును పొదుపుచేయవచ్చు .
ఇలా ఒక్కొక్క అడుగున మార్పు తీసుకురాగలిగితే భూమియొక్క విషయంలో కొంచెం మార్పును తీసుకురావటానికి వీలౌతుంది. వెయ్యి డాలర్ల పెన్ తో వ్రాయచ్చు వంద డాలర్ల పెన్ తోనూ వ్రాయచ్చు. ఏ కలముతో వ్రాసినా అక్షరాలు వస్తాయి. ఆడంబరాన్ని తొలగించినట్లైతే మనకు కావలసినది తీసుకుని ఇతరులకు సహాయపడవచ్చు.
ఒక పెద్ద తటాకము మలినమై ఉందనుకోండి. దానిని నేను ఒంటరిగా ఏలా శుభ్రం చేయటానికి కుదురుతుంది అని విచారించి దుఃఖించి వెనుతిరగకూడరదు. మన వల్ల అయినది శుభ్రం చేయాలి. దానిని చూసి పక్క వ్యక్తి శుభ్రం చేస్తాడు. దానిని చూసి ఇంకో వ్యక్తి వస్తాడు. అలా శుభ్రమయి శుభ్రమయి తటాకం అంతా శుభ్రం అవుతుంది. అందుచేత వెనుతిరగటము అన్నది కాదు, పరిశ్రమనే కావాలి.

carpool పెట్టడము, తేనెటీగలను పెంచటము, చెట్లను నాటటము, పర్యావరణమును శుభ్రపరచటము, ప్రకృతిని మాలిన్యముక్తంగా చేయటము, కాయకూరల మొలకలను నాటటము, ఇవన్నీ ఎన్నో ఏళ్ళ క్రితం అమ్మ చెప్పారు. దానిని పిల్లలు ఆచరిస్తున్నారు. ఇంకొంచెం జాగ్రత్తగా అందరూ ఒక్కటైనట్లైతే  ఈ భూమిని మనము స్వర్గముగా మార్చటానికి సాధ్యమౌతుంది.  దానికి కృప అందరినీ అనుగ్రహించని అని పరమాత్మను ప్రార్థిస్తున్నాను.

**********
పారిస్ లో జరిగిన Climatic Conscience శిఖాగ్రసమావేశంలో అమ్మను ఫ్రెన్చ్ ప్రెసిడన్ట్ François Hollande ఒక ప్రత్యేక దూత ద్వారా ఆహ్వానింపబడినప్పటికీ, ముందుగా నిర్ణయింపబడ్డ అమేరికా పర్యటన కార్యక్రమంలో ఉన్నందువల్ల అమ్మకు పాల్గొనటానికి వీలుకాలేదు. అమ్మయొక్క ప్రతినిధిగా మాతా అమృతానందమయీ ఆశ్రమం యొక్క ఉపాద్యక్షుడైన స్వామీ అమృతస్వరూపానందపురి, అమ్మ సందేశమును అందించారు.

ఈ సమావేశములో కోన్స్టాన్టినోపుల్ ఆర్చ్ బిషప్ బర్తలోమియో-I, ఐక్యరాజ్యసమితి పూర్వ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, నోబల్ సమ్మాన గ్రహీత డా. ముహమ్మద్ యూనిస్, ప్రపంచ ప్రఖ్యాత సినీ నటుడు, సోషియల్ ఆక్టివిస్ట్ అయిన ఆర్నోళ్డ్ షోర్సేనగర్, మరియు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక, రాజకీయ, సాంఘిక నాయకులు, ఐక్యరాజ్యసమితియొక్క వివిధ సమస్థలనుండి విచ్చేసిన ప్రతినిధులు మొదలైనవారు పాల్గొన్నారు. వారందరూ ఏక కంఠంతో ప్రకృతి రక్షణకోసం, శక్తివంతమైన, ఫలప్రదమైన తీర్మానాలు రూపకల్పన చెయ్యాలని, అంతర్జాతీయపరంగా ఒక నివేదన తీసుకురావసిన అత్యవసర ఆవశ్యం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. డిసంబర్ నెల పారిస్ లో జరగబోవు మరో శిఖరాగ్రసమావేశం Cop21 మునుపే ఈ నిర్ణయాలు రూపకల్పన చెయ్యాలని అందరూ సంకల్పించారు.

పిల్లలారా, నాలుక యొక్క రుచిని విడిచిపెట్టకపోతే హృదయం యొక్క రుచిని అనుభవించలేము.

 

ఈ ఆహారం తినాలి, ఇది తినకూడదు అని ఖచ్చితంగా చెప్పటం సాధ్యం కాదు. వాతావరణములోని మార్పులననుసరించి ఆహారానికి మన పైన ఉన్న ప్రభావం కూడా మారుతుంటుంది. ఇక్కడ (దక్షిణ భారతదేశంలో) తినకూడనిది హిమాలయాల్లో మంచిదవుతుంది.

ఆహారం తినడానికి వచ్చి కూర్చున్నప్పుడు భగవంతుని స్మరించిన తరువాతే తినాలి. అందుకే తినడానికి ముందు మంత్రం జపించేది.  ఆహారం ముందు ఉన్నప్పుడే మన సహనాన్ని పరీక్షించటానికి సరైన సమయం.

తపస్వికి ఆహారం కోసము వెతుకుతూ తిరుగవలసిన అవసరం లేదు. సాలీడు గూడు అల్లి అక్కడే కూర్చుంటుంది. ఆహారం కోసం వెతుక్కుంటూ ఎక్కడికీ వెళ్ళదు.దానికి కావలసిన ప్రాణులు ఆ గూడులో చిక్కుకుంటాయి. అదే విధంగా, తపస్వికి అవసరమైన ఆహారం కూడా ఈశ్వరుని ద్వారా అతని దగ్గరకే వచ్చి చేరుతుంది. కానీ, అతను భగవంతునికి పూర్తిగా శరణాగతుడైన వాడై ఉండాలి.

ఆహారము మన స్వభావంపై ఎంతో ప్రభావము చూపుతుంది. పాచిపోయిన ఆహారా పదార్ధాలు తమోగుణాన్ని పెంచుతాయి.

ఒక సాధకుడు మొదట్లో ఆహార సంబంధమైన విషయాలలో నిగ్రహం పాటించాలి.  నియంత్రణ లేని ఆహారక్రమము చెడ్డ లక్షణాలను పెంచుతుంది. విత్తనాలు చల్లిన తరువాత కోళ్ళూ, కాకులూ ఏరుకుని తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. అది పెరిగి చెట్టు అయిన తరువాత దాని మీద ఏ పక్షి అయినా కూర్చోవచ్చు లేదా గూడు కట్టుకోవచ్చు. అందుకే ఇప్పటి నుండే ఆహారాన్ని నియంత్రిస్తూ సాధన చెయ్యాలి. తరువాత, కారము, పులుపు, చేప, మాంసము లాంటివి  ఏవైనా ఫర్వాలేదు; అది మీ మీద ప్రభావము చూపదు. పిల్లలారా, అమ్మ ఈ రోజు ఇలా చెప్పారని, మీరు రేపు ఆ విధంగా చెయ్యకూడదు. లోకానికి ఆదర్శంగా జీవించాలి. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. కామెర్ల వ్యాధిగ్రస్థుడైన వ్యక్తి ముందు మనము కారము పులుపు వేసుకోగూడదు. మనకు రోగము లేకపోయినప్పటికీ, ఇతరులను బాగుచేయటానికి నిగ్రహం అవసరము..

టీ త్రాగుట మానటము, పొగ త్రాగుట మానటము ఇవన్నీ చాలా సులభమని కొందరంటారు. ఈ సులభమైన వాటిని కూడా మానలేని వారు, మనస్సుని ఎలా నిగ్రహించుకోగలరు? అందుకే మొదట ఈ సులభమైన వాటిని నియంత్రించాలి. చిన్న నదులను కూడా దాటలేనివారు మహాసముద్రాన్ని ఎలా దాటగలరు?

మొదట్లో ఒక సాధకుడు దుకాణాల నుండి ఏమీ తినగూడదు. దుకాణదారుడు ఒక్కో వస్తువుని తీసేటప్పుడు ఎంత ఎక్కువ లాభము పొందాలని మాత్రం ఆలోచన ఉంటుంది. టీ తయారు చేసేటప్పుడు, ‘ఇంత కావాలా, ఇన్ని పాలు అవసరమా, పంచదార ఎందుకు తగ్గించకూడదు’ ఇలా, ‘కొంచెం కొంచెం’ అనే ఆలోచనల తీరులో ఉంటాడతను. ఈ ఆలోచనా తరంగాలు ఆహారం తినే సాధకునిపై కూడా ప్రభావం చూపుతాయి.

ఒక సన్యాసి ఉండేవాడు. అతడు వార్తాపత్రికలు చదివేవాడు కాదు. కానీ, వార్తాపత్రిక చదవాలనే గాఢమైన  కోరిక అతనిలో కలిగింది. ఆ తరువాత, వార్తాపత్రికా, దానిలోని వార్తలూ స్వప్నంలో కనిపించటము మొదలయ్యింది. దీనికి కారణమేమిటా అని విచారణ చేస్తే, పనివాడు వంట చేస్తూ వార్తాపత్రిక చదువుతున్నాడని తేలింది. అతడికి శ్రద్ధ వంట చేయడంపై లేదు, వార్తాపత్రిక చదవటం పైనే ఉంది. వంటవాడి ఆలోచనా తీరు సన్యాసిపై కూడా ప్రభావం చూపింది.

గొంతు వరకు వచ్చేదాకా ఆహారం తినగూడదు. కడుపులో సగభాగం ఆహారానికి, పావుభాగం నీటికి, మిగిలినది వాయు చలనానికి వదలాలి. ఆహారం తక్కువగా తిన్నకొద్దీ మనోనిగ్రహం ఎక్కువవుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకూడదు. ధ్యానం కూడా చేయకూడదు. అలా చేస్తే సరిగా జీర్ణమవ్వదు.

భగవంతుని పట్ల గాఢమైన ప్రేమ కలిగిందంటే, అది జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిలాంటిది. అతడికి రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉండదు. తీపిదైనప్పప్పటికీ చేదుగా అనిపిస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ కలిగినప్పుడు కూడా ఇలానే ఉంటుంది. అహారము పట్ల ఉన్న కోరిక తనంతట తానే తగ్గిపోతుంది.

పిల్లలారా, కోరిక మరియు స్వార్థం నుండే అహంకారముదయిస్తుంది. ఇది సహజంగా జరిగినది కాదు, సృష్టించబడినది.

మనకు రావలసిన బాకీ వసూలు చేయడానికి ఒక చోటుకి వెళ్లామనుకోండి. రెండు వందల రూపాయలు వస్తాయని ఆశించాము. కానీ యాభై రూపాయలు మాత్రమే వచ్చాయి. కోపంతో ఊగిపోతూ వాడిని కొడతాము. ఆ తరువాత కోర్టులో కేసు కూడా అవుతుంది. కోరిన మొత్తము దొరక్కపోవటం వలనే కదా కోపము వచ్చింది. చివరకు కోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. శిక్ష పడితే భగవంతుడిని నిందించి ప్రయోజనమేమిటి? ఆశించటం వలన కోపము, కోరిక వలన దుఃఖము వచ్చాయి. కోరికల వెనుక పరుగెత్తుటం వలన వచ్చే ఫలితమిదే.

కోరికలు మరియు అహంకార భారము ఉన్నట్లైతే, భగవత్‍కృప అనే గాలి మనల్ని పైకెత్తలేదు. భారాన్ని తగ్గించుకోవాలి.

ఆకులన్నింటినీ రాల్చే వృక్షాలకి చాలా పూలు పూస్తాయి. వేరే చెట్లకు అక్కడక్కడ మాత్రమే. పిల్లలారా, మనలోని స్వార్థము, అహంకారము, అసూయ మొదలైన అన్ని దోషాలు నిశ్శేషమైనప్పుడు పూర్ణమైన భగవత్‍దర్శనము లభిస్తుంది.

సాధకుడికి స్వార్థం లవలేశము కూడా ఉండకూడదు. అది పుష్పాల నుండి మకరందము పీల్చే పురుగుల వంటిది. మకరందాన్ని పీలుస్తున్న పురుగులను అక్కడ పెరగనిచ్చినట్లైతే, పుష్పము పండు అవుతున్నప్పుడు, దానిలో కూడా పురుగులు పడతాయి. ఈ విధంగా ఉన్న కాయల వలన ప్రయోజనం లేదు. అదే విధంగా, స్వార్థాన్ని పెరగనిచ్చినట్లైతే, అది మన సద్గుణాలన్నింటినీ తొలిచి వేస్తుంది.

పిల్లలారా, ఆధ్యాత్మిక జీవికి ఉన్న కోరికలకు మరియు లౌకికునికి ఉన్న కోరికలకు మధ్య ఎంతో అంతరము ఉంది. అలల లాగా ఒకదాని వెనుక మరొకటి వచ్చి కోరికలు లౌకికుడిని బాధిస్తాయి. అతడి కోరికలకు అంతము లేదు. కానీ, ఆధ్యాత్మికాన్వేషికి ఒక్క కోరిక మాత్రమే ఉంది. అది సాధించిన తరువాత అతడిని బాధించటానికి వేరే కోరికలేమీ లేవు.

ఆధ్యాత్మిక జీవి యొక్క స్వార్థం లోకోపకారము. ఒక గ్రామములో, పూర్వము, ఇద్దరు యువకులుండేవారు. అక్కడికి వచ్చిన ఒక సన్యాసి నుండి వారిద్దరికి చెరొక విత్తు లభించింది. మొదటివాడు దాన్ని వేయించి తిని ఆకలి తీర్చుకున్నాడు. వాడు లౌకికుడు. రెండవవాడు, తన గింజను మొలకెత్తించి చాలా ధాన్యాన్ని పండించి ఇతరులకు కూడా ఇచ్చాడు. పిల్లలారా, విత్తును పొందాలన్న స్వార్థం ఇద్దరికీ ఉంది. అయితే, రెండవ వాడి స్వార్థం ఎంతో మందికి మేలు చేసింది!

పిల్లలారా, ఉన్నది ఒక్కటే ఆత్మ. అది సర్వవ్యాపి. మన మనస్సు విశాలమైనప్పుడు మనము దానిలో లయమవ్వగలము. ఆ తరువాత అక్కడ స్వార్థం అహంకారం కనిపించవు. అక్కడ అంతా సమానమే. ఒక్క క్షణము కూడా వృధా చెయ్యకుండా సహాయము చెయ్యండి. ఎవరి నుండీ ఏమీ ఆశించకుండా ఇతరులకు సేవ చెయ్యండి.

చిన్న స్వార్థం ద్వారా పెద్ద స్వార్థాలను తొలగించుకోవచ్చు. వల్లె వేసిన గోడల మీద ‘ప్రకటనలు అంటించరాదు’ అనే ప్రకటన ఉంటే గోడ యొక్క మిగతా భాగం శుభ్రంగా ఉంటుంది. ఇటువంటిదే భగవంతుడు కావాలనుకునే స్వార్థం కూడా.

నూతన సంవత్సరం, ఆదివారం, 00:10ని״కి, 1 జనవరి 2012 – అమృతపురిలో

“మన జీవితాలు మరియు సకల ప్రాణికోటి జీవితాలు మంగళప్రదమవ్వాలని ఈ సందర్భంగా అమ్మ ప్రార్థన. అమ్మ అందరి పిల్లల  జీవితాలలోనూ మరియు ప్రపంచంలోనూ, సానుకూల మార్పులు తీసుకువచ్చే దివ్య శక్తి ఉదయించుగాక. ఈ నూతన సంవత్సరము ఒక నవ్య వ్యక్తి, ఒక నవ్య సమాజము జన్మించటానికి దారి తీయాలని అమ్మ ప్రార్థన.”

“నూతన సంవత్సరమనేది ఒక మంచి అవకాశం. జనులందరూ తమ గత సంవత్సరములో చేసిన తప్పులని సరిదిద్దుకొని వారి సోమరితనాన్ని అధిగమించటానికి ప్రయత్నము చేసే ఒక శుభ సందర్భము నూతన సంవత్సరము. ఒక కొత్త శుభారంభంలో ఆసక్తి, ఉత్సాహము మేల్కొంటాయి. ఎంతో మంది కొత్త సంవత్సరంలో ఎన్నో నూతన సంకల్పాలు చేస్తారు. కొత్త అలవాట్లను చేసుకునేందుకు కృషి చేస్తారు. చాలా మంది డైరీ వ్రాయడము మొదలుపెడతారు. కానీ, ఆరు నెలల తరువాత ఆ డైరీ తెరిచి చూస్తే, ఒకటి రెండు వారాల పాటు మాత్రమే డైరీ నింపి ఉండటం చూస్తాము – మహా అయితే మూడు నెలల వరకు వ్రాస్తారు. ఎందరో జీవితాల్లో మనము ఇదే చూస్తాము. మనలో మంచి పనులను పట్టుదలతో సాధించే సామర్థ్యము లేదు. నిరంతర ప్రయత్నమనేది ఎప్పుడూ ప్రశంసనీయమే. ఉదాహరణకు, ఎవరైనా సైన్యంలో గానీ లేదా ఏ ఇతర సంస్థలో గానీ అనేక సంవత్సరాల పాటు సేవ చేస్తే, వారు ఆ సంస్థ ద్వారా సన్మానాన్ని పొందుతారు. కానీ మనము ఈ పట్టుదల, సంకల్పమనేది మనము తీసుకున్న వాగ్దానాలలో మంచి పనులలో స్థిరంగా ఉంచుకోలేము. మనలో చాలా మంది యోగాభ్యాసము మొదలుపెడతారు, కానీ రెండు మూడు రోజుల తరువాత ఆపేస్తారు. కొంత మంది చిన్న పిల్లలు ఎంతో ఉత్సాహంగా ధ్యానం చేయడము మొదలుపెడతారు, కానీ రెండు మూడు నెలల తరువాత ఆపేస్తారు.”

“సత్‍కర్మలు చెయ్యటంలో మనము ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మనస్సు ప్రతీ క్షణము మారుతుంటుంది. మంచిగా మాట్లాడటానికి, మంచి పనులు చేయటానికి, ధైర్యము సహనము కరుణ వంటివి అభ్యాసము చేయటానికి నిరంతర జాగరూకత, విశేష కృషి అవసరము. నెమ్మది నెమ్మదిగా ఈ పనులే అలవాటుగా మారి, చివరికి స్వతఃసిద్ధంగా మన స్వభావంగా మారుతాయి. ఇటువంటి అలవాట్లే జీవితంలో విజయాన్ని చేకూరుస్తాయి.”

“జీవితమనే కాగితంపై మన ఇచ్ఛానుసారము ఏమైనా వ్రాసుకునే స్వాతంత్ర్యం మానవులకే ఇవ్వబడింది. పరమాత్ముడు మనకు కాగితము కలము ఇచ్చాడు, కానీ, ఏమి వ్రాయాలో తాను చెప్పడు. ఎలా వ్రాయలి అన్నది మాత్రము ఆయన మనకు నేర్పిస్తాడు. అప్పుడప్పుడూ సంకేతాలు ఇస్తూ ఉంటాడు, కానీ ఏమి వ్రాయాలి అనే నిర్ణయం మాత్రం మనకే వదిలేస్తాడు. మనకు పూర్ణ స్వాతంత్ర్యం ఉంది. మనము కోరుకుంటే, మంచితనము, ప్రేమ సౌందర్య పాత్రులుగా వ్రాయవచ్చు, లేదా చెడు, ద్వేషము, వికృతముతో కూడిన జీవితాన్నీ వ్రాసుకోవచ్చు. పరమాత్మ మనకి మంచి చెడులను రెండింటినీ తెలుసుకోగలిగేలా సూచనలు ఇస్తూ ఉంటాడు. 2011 సంవత్సరంలో మానవాళి ఇటువంటి సూచనలు ఎన్నో అందుకుంది.”

“ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక వైరుధ్యాలు మరియు ఆర్థిక సంక్షోభాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. భయము మరియు చింత అనేవి ప్రతి రోజూ తీవ్రతరమౌతూ మనుషుల మనస్సులను వేటాడుతున్నాయి. మానవుని వివేకరహిత చర్యల వలన ప్రకృతి తన సమతుల్యాన్ని కోల్పోయింది. గాలి, నీరు మరియు భూమి విషపూరితమవుతున్నాయి. ఒకప్పుడు కామధేనువుగా ఉన్న ప్రకృతి, ఇప్పుడు వట్టిపోయింది. భూమిలోని చమురు నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఆహార పదార్ధాల ఉత్పత్తి తగ్గిపోతోంది. త్రాగు నీరు మరియు స్వచ్ఛమైన గాలి మృగ్యమవుతున్నాయి. మనం ఎక్కడ తప్పటడుగు వేశాము?”

“వాస్తవంగా ఈ సమస్యకి మూల కారణమేమిటని చూస్తే మనము మన అవసరాలకు విలాసాలకు మధ్య ఉన్న తేడాను గుర్తించలేని అసమర్థులమని తెలుస్తుంది.”

“ఒకవేళ మన వర్తమాన తరం ధర్మాన్ని జాగరూకతతో గ్రహించి  పునఃస్థాపించగలిగినప్పుడు పేదరికం మరియు ఆకలి అనేవి ఒక పీడ కల లాగా మాయమవుతాయి.”

“నూతన సంవత్సర ఆగమనము కాల గమనాన్ని గురించి మనకు గుర్తు చేస్తుంది. పగిలిన కుండలోంచి చుక్క చుక్కగా నీరు ఎలా కారుతుందో, అదే విధంగా నిమిష నిమిషమూ మన ఆయుర్దాయము క్షీణిస్తోంది. ఈ ప్రపంచములో మనిషికి ఉన్న అత్యంత విలువైన నిధి సమయము. ఒక్క సమయము తప్ప పోగొట్టుకున్నదేదైనా తిరిగి పొందవచ్చు,. మనము దీనిని అర్థము చేసుకుని, ప్రతి క్షణమూ జాగరూకతతో జీవించాలి. అంతే కాదు, గడియారము టిక్కుటిక్కుమంటున్న ప్రతి సారీ, మనము మృత్యువుకు దగ్గరవుతున్నామని గుర్తు చేసుకోవాలి.”

“ప్రపంచములో మనము చూసేది, వినేది, అనుభవము చేసుకునేది, ఏదైనా సరే, అది అనిత్యమైనది. సర్వానికీ ఆధారమూ, నిత్యమూ అయిన ఆత్మని మనము తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ ప్రపంచంలోని ఏ వస్తువు ఏ వ్యక్తీ మన నుంచి వేరు కాదని.”

“మనము నవ్వినా ఏడ్చినా రోజులు మాత్రము గడిచిపోతాయి. కాబట్టి మనము ఎందుకు నవ్వటాన్ని ఎంచుకోకూడదు? నవ్వనేది ఆత్మ యొక్క సంగీతము. అయితే, ఇతరులలోని లోపాలను చూసి మనము నవ్వకూడదు. మనము అందరిలోనూ మంచినే చూస్తూ సత్‌చింతనలు, సత్‌వాక్కులు, సత్‌కర్మలను  పంచుకోవాలి. మనము మనలోని లోపాలను తప్పిదాలను చూసి నవ్వటానికి ప్రయత్నించాలి.”

“అనేక మంది పిల్లలు అమ్మను అడుగుతుంటారు “అమ్మా, 2012 లో ప్రపంచము అంతమవుతుందా?” అని. అలా జరుగుతుందని అమ్మ అనుకోవటము లేదు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు సంభవించవచ్చు. మనము భూమిని చూసినా, నీటిని చూసినా, గాలిని చూసినా, ప్రకృతిని చూసినా, మనుషులను చూసినా, అన్నీ కల్లోల స్థితిలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ కల్లోలం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉరుము లాగా ప్రతిధ్వనిస్తుంది. ఏదేమైనా, మరణమనేది జీవితంలో ఒక అనివార్యమైన భాగము. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు. అయితే, ఫుల్‌స్టాప్ పెట్టిన తరువాత కొత్త వాక్యము వ్రాయడం మొదలుపెట్టిన విధంగానే, ఒక జీవితపు అంతము మరొక జీవితారంభాన్ని సూచిస్తుంది. కానీ మనము భయముతో జీవించకూడదు. బదులుగా, మనము అన్నింటినీ స్వీకరించే మనోభావాన్ని పెంపొందించుకోవాలి. “ఏదేమైనా సరే నేను శక్తివంతంగా, ధైర్యంగా, సంతోషంగా ఉంటాను” అనే మనోభావము ఉండాలి. భయముతో జీవించటమనేది బాంబు పైన పడుకోవటము వంటిది; ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోలేము. కానీ, అమ్మ తీవ్రమైన సంఘటనలు జరగటము చూడటం లేదు. విషాదకరమైన సంఘటనలనేవి ఎప్పుడూ ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా, ప్రయాణము చేసేటప్పుడు మనము ప్రమాదాలను చూడటం లేదా? విమానము కూలిందని మనము వినటం లేదా? వరదలు, భూకంపాలు, తుఫానులు మరియు సునామీలు క్రమం తప్పకుండా సంభవిస్తున్నాయి. మనము ఎక్కడ ఉన్నా, సంతోషంగా ఉందాము. మన సత్‍స్వరూపములో శ్రద్ధ విశ్వాసాన్ని పెంపొందించుకుందాము. సత్‍కర్మలు చేద్దాము.”

“క్రిమికీటకాలు పుడతాయి, వంశ వృద్ధి చేస్తాయి, మరణిస్తాయి. జంతువులు కూడా ఇదే చేస్తాయి. మానవులు కూడా ఇలాగే జీవిస్తే, ఇక మనకు ఇతర జీవాలకు మధ్య ఉన్న తేడా ఏమిటి? మనము ప్రపంచానికి ఏమి సందేశము ఇస్తున్నాము? మహాత్ములు తమ నిష్కామ కర్మల ద్వారా అమరులయ్యారు. వారు చేసినంతగా మనము చెయ్యలేకపోవచ్చు, సర్వం అర్పించలేకపోవచ్చు. కానీ, ఇతరుల కోసము ఏమైనా చెయ్యగలమేమో చూసి దానికోసం కొంచెమైనా ప్రయత్నిద్దాము. ఎడారిలో ఒక్క చెట్టు పెరగగలిగినా, కనీసం దాని క్రింది కొంత నీడనైనా ఇవ్వగలుగుతుంది. ఒక పుష్పం వికసించినా, కనీసం ఆ మాత్రం సౌందర్యం ఉంటుంది. ఒక జీరో-వాట్ బల్బు కాంతి క్రింద మనము చదవలేకపోవచ్చు, కానీ అలాంటి అనేక బల్బులు కలిసి ప్రకాశించినప్పుడు, మనము సరిగ్గా చూడగలము. ఈ విధంగా, ఐక్యత ద్వారా మనము ఎంతో సాధించవచ్చు. ఈ ప్రపంచము ఒక సరస్సు వంటిది, ఒక వ్యక్తి ద్వారా దానిని శుభ్రం చెయ్యడం సాధ్యం కాదు. అయితే, ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేస్తే, మనమందరమూ కలిసి తప్పకుండా దీనిని శుభ్రం చెయ్యగలము. మనము సోమరితనాన్ని వదిలివెయ్యాలి. మనము చెయ్యగలిగినది మనం చేద్దాము. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించగలము.”

“ఇతర నిర్ణయాలలా, ఆనందంగా ఉండటమనేది కూడా ఒక నిర్ణయమే – “ఏదేమైనా నేను సంతోషంగా ఉంటాను. నేను శక్తిని కలిగి ఉంటాను. నేను ఎప్పుడూ ఒంటరిగా లేను. పరమాత్మ ఎప్పుడు నాతో ఉన్నాడు.” అనే దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. నా పిల్లలందరూ మానసికశక్తి, ఉత్సాహము మరియు ఆత్మవిశ్వాసము కలిగి ఉండుగాక. నా పిల్లలందరి మీదా పరమాత్ముని కృప వర్షించుగాక.”

అమ్మ, శ్రీ మాతా అమృతానందమయి దేవి 2012 నూతన సంవత్సర సందేశ సారాంశము