మంత్రాలకు శక్తి లేనట్లైతే, అప్పుడు మాటలకు కూడా శక్తి లేదు. “బయటకు పో” అని కోపంగా చెప్పినదానికి, “దయచేసి బయటకు వెళ్ళండి” అని సౌమ్యంగా చెప్పినదానికి, విన్న వారిలో భిన్న ప్రతిస్పందనలు కలుగుతాయి కదా?

మంత్రము జపించేది మన మనస్సును శుద్ధి చేయటానికి మాత్రమే. అంతే కానీ, మంత్రముతో భగవంతుని తృప్తిపరచేందుకు కాదు. భగవంతునికి మంత్రము ఎందుకు?

మంత్రము జపిస్తే, అది మాత్రం చాలు. అర్థాన్ని గురించి ఆలోచించి తల బద్దలు చేసుకోవలసిన అవసరము లేదు. మీరు ఆశ్రమానికి వచ్చేటప్పుడు బస్సు, కారు, రైలు వంటి వాటిల్లో ఎక్కి కూర్చుంటారు. మీరు ఆ వాహనము గురించి ఆలోచిస్తూ సమయము వృధా చేసుకోరు కదా. లక్ష్యాన్ని గురించిన జ్ఞానమున్నవాడు అయితే చాలు.

మంత్రదీక్ష పలు రీతులుగా ఉంది. నయన దీక్ష, స్పర్శ దీక్ష, సంకల్ప దీక్ష, మంత్రోపదేశము ఈ విధంగా. మంత్రము వ్రాసి ఇవ్వటములో తప్పు లేదు. అయితే, మంత్రము ఉపదేశించినాక శిష్యుని యొక్క సకల భారాలు గురువివే. యథార్థ గురువు నుండే మంత్రోపదేశము స్వీకరించాలి. యథార్థ గురువు కానట్లైతే, నీటిని శుద్ధి చేయటానికి మురికిగా ఉన్న ఫిల్టరును ఉపయోగించటము లాగా ఉంటుంది. నీరు మరింత చెడిపోతుంది.

పిల్లలారా, బస్సులోకి ఎక్కి టిక్కెట్టు తీసుకున్నాను కదా అని అశ్రద్ధగా ఉండకూడదు. దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. టిక్కెట్ కలక్టర్ వచ్చినప్పుడు చూపించకపోతే, దింపి వేస్తాడు. అదే విధంగా, మంత్రము దొరికిందని చెప్పి అంతా అయిపోయిందని అనుకోవద్దు; ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించినప్పుడు మాత్రమే అది మిమ్మల్ని చేర్చవలసిన స్థలానికి చేరుస్తుంది.

 

పిల్లలారా, మనస్సును ఏకాగ్రము చేయటమే యదార్థ విద్య.

హృదయములో గాని భ్రూమధ్యములో గాని ధ్యానించవచ్చు. ఆసనములో సుఖంగా, సౌక్యంగా కూర్చోగలిగే వరకు హృదయములో ధ్యానించాలి. గురు సాన్నిద్ధ్యములో ఉన్న వారు మాత్రము భ్రూమధ్యములో ధ్యానించుట మంచిది. కారణం, ధ్యానము వలన తల వేడెక్కటము, తలనొప్పి వంటివి రావచ్చు. కొన్ని సందర్భాలలో నిద్ర పట్టకపోవచ్చు. ఈ సందర్భాలలో ఏమి చేయాలో గురువుకి తెలుసు.

అన్ని అస్వస్థతల నుండి రక్షణ పొందేందుకు, మానసికాందోళనలను తగ్గించేందుకు, ధ్యానము సహకరిస్తుంది. ధ్యానము చేయడానికి భగవంతుని పై విశ్వాసము అవసరము లేదు. శరీరములో ఏదైనా ఒక భాగము పైన మనస్సును ఏకాగ్రము చేయవచ్చు. లేకపోతే బిందువునైనా ధ్యానించవచ్చు. తాను అనంతములో లయమవుతున్నట్టుగా భావన చేయవచ్చు. నది సముద్రములో లయమవుతున్న విధముగా.

మన మనస్సు లయము చెందినప్పుడు ఆనందము లభిస్తుంది. అంతేకాని వేరే వస్తువుల నుండి కాదు. ధ్యానము వలన పొందేది ఆనందము ఒక్కటే కాదు. సౌందర్యము, ఆయుష్షు, శక్తి, ఆరోగ్యము, బుద్ధి, ఓజస్సు అన్నీ పొందుతాము. ఏకాంతములో శ్రద్ధతో సరిగా మాత్రము చెయ్యాలి.

ఇష్టరూపాలపై ధ్యానించుట వలన ఏకాగ్రతతో పాటు మనఃశుద్ధి పొందటానికి వీలవుతుంది. ఇష్టమూర్తి యొక్క సాత్విక గుణాలు మనకు తెలియకుండానే వృద్ధి చెందుతాయి. ఊరికే కూర్చున్నప్పుడు కూడా మనస్సును పరిభ్రమించనీయవద్దు. దృష్టి ఎక్కడ పడినప్పటికీ, అక్కడ ఇష్టదేవుడిని భావన చెయ్యాలి.

మీకు దీపముపై ధ్యానించుట ఇష్టమైనట్లైతే అది చాలు. ఒక గదిలో కూర్చుని వెలిగించిన కొవ్వొత్తిని గాని, లేక వేరే చిన్న దీపజ్యోతిని గాని, కొంచెము సేపు చూడాలి. జ్యోతి నిశ్చలంగా ఉండాలి. ఆ జ్యోతిని హృదయంలో గాని, లేక భ్రూమధ్యంలో గాని ధ్యానించవచ్చు. జ్యోతిని చూడటము పూర్తి అయిన తరువాత లోపల స్పష్టంగా కనిపిస్తున్న ప్రకాశములో మనస్సుని ఏకాగ్రము చేయవచ్చు. ఇష్టదేవత జ్యోతిలో నిలుచుని ఉన్నట్లుగా భావన చేస్తూ ధ్యానము చేయవచ్చు. కానీ ఇష్టదేవత హోమాగ్నిలో నిలుచుని ఉన్నట్లుగా భావన చేస్తూ ధ్యానం చేయటము మంచిది. కారణం, అసూయ, అహంకారము మొదలైనటువంటివి హోమాగ్నిలో ఆర్పిస్తున్నట్లుగా భావన చెయ్యవచ్చు.

పిల్లలారా, ధ్యానము చేస్తున్నప్పుడు రూపము పొందటములేదని ధ్యానము ఆపవద్దు. ఇష్టదేవుడి యొక్క ఒక్కో అంగాన్ని పాదాల నుండి క్రమంగా కేశము వరకు లోన భావన చేస్తూ చూడాలి. భగవంతుడికి అభిషేకము చేయండి. అన్ని విధములైన ఆభరణాలతో వస్త్రాలతో అలంకరించండి. ఆహారము ముద్దలు చేసి పెట్టండి. ఈ విధముగా మనస్సులోని భావనల వలన ఇష్టరూపము మనస్సు నుండి చెరిగిపోదు.

మనస్సుని నిర్బంధించి ధ్యానము చేయించటము, తెప్పని నీటి అడుగున పట్టుకుని ఉంచటానికి ప్రయత్నించుట వంటిది. పిల్లలారా, పట్టు వదిలినట్లైతే అది వెంటనే పైకి తేలి రావటము చూస్తాము. ధ్యానించటము సాధ్యము కానట్లైతే జపం చేయండి. జపము ద్వారా మనస్సు ధ్యానానికి అనుకూలము అవుతుంది.

మొదట రూపధ్యానము ఆవశ్యము. దాని మూలంగా ఇష్టదేవుడిలో మనస్సు స్థిరమవుతుంది. ఎందుకు ధ్యానించినా, ఎలా ధ్యానించినా, ఏకాగ్రతే ముఖ్యం. చిరునామా వ్రాయకుండా ఎన్ని రూపాయల స్టాంపులు అతికించి ఉత్తరము పంపించినప్పటికీ ఏమిటి ప్రయోజనము? ఏకాగ్రత లేని జపధ్యానాలు కూడా ఇటువంటివే.

దురాలోచనలను తొలగించటానికి ప్రయత్నించినప్పుడే, అవి వేధించడము మొదలుపెడతాయి. పూర్వం మనము వీటిలోనే ఉన్నప్పుడు, అవి ఇబ్బందికరంగా అనిపించలేదు. వాటి నుండి విభిన్నమైన ఒక భావమే మనకు ఇప్పుడు ఉన్నది. అందుకే వాటి గూర్చి మనకు జ్ఞానము కలిగింది. పూర్వము, అవి ఉన్నప్పటికి కూడా మనకు తెలియదు. ధ్యాన సమయములో ఇటువంటి ఆలోచనలు పైకి వచ్చినప్పుడు, “మనసా, దీని వలన ఏమైనా ప్రయోజనముందా? ఇదంతా ఆలోచించటమేనా నీ లక్ష్యము?” ఈ విధంగా వివేచన చెయ్యాలి. ప్రాపంచిక విషయాల పట్ల పూర్తిగా విరక్తి రావాలి. వైరాగ్యము పెంపొందించుకోవాలి. భగవంతుని పట్ల ప్రేమ రావాలి.

పిల్లలారా, ధ్యానించే సమయములో నిద్ర వస్తుంటే, దానికి లొంగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ సమయములో నడుస్తూ జపము చేయాలి. తమస్సు పోతుంది. ధ్యానము మొదట్లో తమస్సంతా పైకి వస్తుంది. జాగ్రత్తగా ఉంటే క్రమేణా పోతుంది. నిద్ర వస్తున్న సందర్భాలలో మాల తీసుకుని జపము చేయాలి. మాలను చేతిలో ఎత్తి పట్టుకుని ఛాతికి ఆనించి శ్రద్ధతో సావధానంగా జపించాలి. దేనికీ ఆనుకోకూడదు. కాళ్ళు కదపకూడదు.

ఎక్కడ కూర్చున్నా నిలబడినా వెన్నెముకను నిటారుగానే ఉంచాలి. వెన్నెముకను వంచి కూర్చుని ధ్యానించకూడదు. మనస్సు ఒక దొంగ. మనను క్రిందకి తోయటానికి అది అవకాశము కోసము కాచుకుని ఉంటుంది. ఆనుకుని కూర్చుంటే మనకి తెలియకుండానే నిద్రపోతాము.

లోపల రూపము సరిగ్గా స్థిరమవ్వటానికి, కనీసము మూడు సంవత్సరాలైనా కావాలి. మొదట్లో రూపాన్ని చూస్తూ కూర్చుని ఏకాగ్రతకై ప్రయత్నించాలి. పది నిముషాలు కళ్ళు మూసుకుని కూర్చుంటే, తరువాతి పది నిముషాలు కళ్ళు తెరిచి ధ్యాన రూపాన్ని చూస్తూ కూర్చోవాలి. క్రమేణా, రూపము స్పష్టమవుట మొదలవుతుంది.

రాత్రి సమయము వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. పక్షి మృగాదులని, లౌకికమైన జీవనము గడుపుతున్నవారినందరినీ, నిద్ర లోబరుచుకుని ఉంటుంది. అందు మూలంగా వాతావరణములో లౌకికమైన ఆలోచనా తరంగాలు తక్కువగా ఉంటాయి. రాత్రి యొక్క చివరి ఘడియలలోనే పుష్పాలు వికసించేది. వాతావరణానికి అప్పుడు ఒక ప్రత్యేక చైతన్యము ఉంటుంది. ఈ సమయములో ధ్యానిస్తే మనస్సు వెంటనే ఏకాగ్రమవుతుంది. ఎక్కువ సమయము ధ్యానములో మునిగి కూర్చోవటానికి సాధ్యమవుతుంది. యోగులు మేల్కొని ఉండే సమయమే రాత్రి.

ధ్యానము చేసిన మరుక్షణమే మాట్లాడటము, తాను కష్టపడి సంపాదించిన ధనాన్నంతా వేరుశనగలపై ఖర్చు చేయటము వంటిది. ధ్యానము ద్వారా సంపాదించిన శక్తి ఇలా పూర్తిగా వృధా అవుతుంది.

ధ్యానసమయము రూపము అస్పష్టమవుతున్నట్లైతే మళ్ళీ రూపాన్ని భావన చేసి జపమనే పాశముతో ఇష్టదేవుడిని పాదము మొదలుకుని శిరస్సు వరకు బంధించినట్లుగా, అదేవిధంగా తిరిగి విప్పుతున్నట్లుగా భావన చెయ్యాలి. మనస్సుని ఇష్టదేవుడిలో బంధించి ఉంచటానికి ఇది సహాయపడుతుంది.

రూప ధ్యానంలో మనం మనల్నే ధ్యానిస్తున్నాము. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చినప్పుడు నీడ అసలు కనిపించదు. అదే విధంగా రూపధ్యానంలో కూడా. మనంతట మనమే దానిగా (ధ్యాన రూపంగా) మారుతాము. పూర్ణత్వంలోకి చేరుకున్నప్పుడు నీడ లేదు. ద్వంద్వం లేదు, మాయ లేదు.

 

 

 

పిల్లలారా, ప్రాణులలోని జీవశక్తే కుండలిని. చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్న ఒక ఆడ పాము ఆకృతిలో వెన్నెముక క్రింది భాగంలో ఈ శక్తి ఉంటుంది. ధ్యానము వలన కానీ, గురు కృప వలన కానీ ఈ శక్తి మేల్కొంటుంది. మేల్కొన్నాక శిరస్సులో ఉంటున్న మగ పాముని చూసిన వ్యాకులతతో, వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఈ శక్తి పైకి దూకుతుంది. సుషుమ్నలోని ఒక్కో ఆధారము ఒక చిన్న రంధ్రము లాగా కనపడుతుంటుంది. ఒక ఆధారములో నుండి వేరొక ఆధారములోకి కుండలిని దూకుతున్నప్పుడు శరీరములో పలు మార్పులు సంభవిస్తాయి.

 

శరీరమంతా మండుతున్నట్లు అనిపిస్తుంది. పచ్చిమిరపకాయలని రుద్దిన మాదిరిగా అనిపిస్తుంది. శరీరమంతా కాల్చినట్లు ఉంటుంది. తరచుగా రోమాంచితమవుతుంది. శరీరమంతా, రోమకూపముల నుండి చెమటలాగా నీరు వస్తుంది. అప్పుడప్పుడు దానంతటదే జలస్రావము అవ్వవచ్చు. కొన్ని సందర్భాలలో రోమకూపాల నుండి రక్తము కూడా బయటకు వస్తుంది. శరీరము సన్నబడి ఎముకలాగా అయ్యి తీరుతుంది.
ఇదంతా మొట్టమొదటిసారిగా అనుభవిస్తున్న సాధకుడు భయపడవచ్చు. అందుకే, సద్గురువు యొక్క సాన్నిధ్యంలో మాత్రమే కుండలినీధ్యానము చెయ్యాలని చెప్పబడింది.

 

పిల్లలారా, ఈ పరిస్థితిలో సాధకుడు ఎంతో శ్రద్ధ చూపాలి. శరీరాన్ని అసలు కదపకూడదు. పరుపు పైన అసలు పడుకోకూడదు. కారణం, అందులోని ముడతలు కూడా వారికి అసహనీయముగా అనిపిస్తాయి. కొంచెము కూడా వంపు లేని, నునుపైన చెక్క పలక మీదే వారు పడుకోవాలి. వెన్నెముకకు ఒక దెబ్బ కూడా తగలకూడదు. అది వారిలో పెద్ద ప్రతిచర్యలను కలుగచేస్తుంది.

 

కుండలిని మేల్కొన్న సాధకుడు ఒక తీవ్ర ఆకర్షణాకేంద్రముగా మారుతాడు. మోహితులైన స్త్రీలు వగైరా అతని చుట్టూ చేరతారు. అవసరమైన నిర్దేశములు ఇవ్వటానికి ఒక సద్గురువు లేకపోతే, ఇంద్రియ సుఖాలు వంటి వాటిలో కలుగచేసుకుని అతడు తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న శక్తిబలాలను పూర్తిగా నాశనము చేసుకుంటాడు.

 

ఒక్కో ఆధారములోకి కుండలిని వచ్చినప్పుడు, ఆ ఆధారాన్ని పరిపాకము చేసినాకే, అక్కడి నుంచి పైన ఉన్న ఆధారానికి చేరుకుంటుంది. ఈ విధంగా మూలాధారాది షడాధారములను దాటుకుని కుండలినీశక్తి సహస్రదళానికి చేరుకుంటుంది.

 

సహస్రదళానికి చేరుకుంటే శరీరము చల్లబడుతుంది. శరీరము మొత్తం అమృతము వర్షిస్తుంది. తరువాత మిగిలినది పాత శరీరము కాదు. ఆత్మశక్తి నిండిన కొత్త శరీరము. ఒక చెట్టు యొక్క వేర్లు నీటిని, ఎరువుని పీల్చుకొని ఆకులకు చేరుస్తాయి. ఆకులు వాటిని పరిపాకము చేసి వేరులతో పాటు చెట్టు యొక్క సర్వాంగాలకు చేరుస్తాయి. పిల్లలారా, పరిపాకమైన ఈ శక్తే చెట్టుని నిలుపుతున్నది. అదే విధంగా మూలాధారములోకి చేరి, సహస్రదళములో పరిపాకమవుతున్న శక్తే అమృత వర్షమయ్యి, నాడుల ద్వారా సర్వాంగాలకూ శరీరమంతటా వ్యాపించి ఓజస్సు అయ్యి శరీరానికి పుష్టి కలిగిస్తుంది.

ప్రాణాయామము చేసేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఎంతో శ్రద్ధతో మాత్రమే అభ్యసించాలి. సాధారణంగా కలిగిన జబ్బులకు చికిత్స చేసి నయం చేయవచ్చు, కానీ తప్పుగా ఆచరించిన ప్రాణాయామము వలన కలిగిన జబ్బులకు చికిత్స చేసినా నయమవ్వవు.

ప్రాణాయామము చేస్తున్నపుడు పొత్తికడుపు భాగంలోని పేగు కదలికకు లోనవుతుంది. దీని అంతటికీ ఒక క్రమముంది. మాత్రాక్రమము1. ఈ క్రమాన్ని ఉల్లంఘించిన వారి పేగు వదులవుతుంది. తరువాత, తిన్న ఆహారం జీర్ణము అవ్వకుండా అలాగే మలము అవుతుంది. అందువలన, పూర్ణుడయిన గురువు నుండే ప్రాణాయామము అభ్యసించాలి. ఒక్కో సమయంలో ఏమి చెయ్యాలో వారికి తెలుసు. దానిననుసరించి వారు మూలికా ఔషధములు వగైరా ఇస్తారు. అలా కాకుండా పుస్తకములో చదివి ప్రాణాయామము చేయటానికి కూర్చుంటే, అది సరి కాదు. ఎవరూ ఆ విధంగా చేయకూడదు.

పిల్లలారా, ఒక్కో ఘట్టంలో ఇన్ని సార్లు ఈ మోతాదులో ప్రాణాయామము చెయ్యాలి అని నిర్ణయించబడినది. అది అనుసరించకపోతే ప్రమాదం. వాటి ప్రభావం, 5 కిలోలు పట్టే సంచిలో 10 కిలోల బియ్యం కుక్కుటకు ప్రయత్నించినట్లు ఉంటుంది.

ఏకాగ్రత పొందిన సమయాన శ్వాస నిశ్చలమవ్వటమే కుంభకము. శ్వాసే ఆలోచన అని చెప్పవచ్చు. ఏకాగ్రమైన ఆలోచనలను అనుసరించి శ్వాసగతిలో మార్పు వస్తుంది.

ప్రాణాయామము లేకుండా భక్తి ద్వారానే కుంభకము సంభవిస్తుంది. జపము మాత్రము నిరాటంకంగా చేస్తే చాలు.

 
— — —
1. ఒక మాత్ర అనగా ఒక హ్రస్వాక్షరాన్ని పలకటానికి పట్టే సమయము. ప్రాణాయామములోని ప్రతి దశనీ, యథాప్రకారంగా, ఇన్ని మాత్రల సేపు చెయ్యాలి అని నిర్ణయించబడింది.