“రాష్ట్ర ప్రభుత్వాల, ఇతర సంస్థల సహకారం, మద్దతు లభిస్తే, భారతదేశం అంతటా పాఠశాలలని, బహిరంగ ప్రదేశాలని శుభ్రం చేసే బాధ్యతని తీసుకుంటామ”ని అమ్మ (మాతా అమృతానందమయి) చెప్పారు. “భారతదేశం ఎదుగుతోంది. అంటే అభివృద్ధి చెందుతోంది. కానీ పర్యావరణ శుభ్రత విషయాలలో మనం వెనకబడి ఉన్నాం. మన వీధుల్లోని శుభ్రతా లోపం దీనికి ఋజువు.” అని అమ్మ చెప్పారు.

పాశ్చాత్య దేశాల్లో వీధుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ, మూత్రశాలల్లోనూ, శౌచాలయాలలోనూ అత్యున్నత ప్రమాణాలుగల శుభ్రతని పాటిస్తున్నారు. పోల్చి చూస్తే, భారతదేశంలోని వీధుల్లో, బహిరంగ శౌచాలయాలలోని శుభ్రత ప్రమాణాలు భయంకరంగా ఉన్నాయి. వీధుల్లో మూత్రం పోయడం, వీధుల్లో, పేవ్‌‍మెంట్ల మీద ఉమ్మడం ప్రజలకి అలవాటుగా మారింది. చెత్త డబ్బాలు ఉన్నా ప్రజలకి చెత్తని, వ్యర్ధ ఆహార పదార్ధాలని వాటిలో వేసే అలవాటు లేదు. వారు వాటిని వీధి పక్కనో, లేదా మధ్యో వేస్తుంటారు. సామాజిక అభివృద్ధిలో, మెరుగుదలలో పర్యావరణ పరిశుభ్రత భాగమవుతుంది. ఇది జరగడానికి మనం విస్తృతమైన ప్రచారాన్ని చేయాలి. పర్యావరణ పరిశుభ్రత మీద మనం బహిరంగ ప్రదేశాలలో, బస్‌స్టాప్‌లలో, వీధుల పక్కన, ప్రకటన బోర్డులని పెట్టాలి.

“ఈ సేవా సంస్థ విజయానికి ఎమ్.ఏ.ఎమ్(మాతా అమృతానందమయి మఠం)కు టివి రంగం, పత్రికా రంగాల నిజాయితీతో కూడిన సహకారం, మద్దతు కూడా అవసరం” అని అమ్మ గట్టిగా చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలల యాజమాన్యాల కమిటీలు, స్థానిక ప్రజలు సహకరిస్తే, పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాలలో ఉచిత బహిరంగ శౌచాలయాలు నిర్మించేందుకు మాతా అమృతానందమయి మఠం సిధ్ధంగా ఉంది.

సరైన నకళ్ళతో, ప్రణాళికతో సాధారణ ప్రజల, విద్యార్ధుల సహకారంతో ఈ పధకం అమలు చేయబడుతుంది.

ఈ పధకం తొలుత కేరళలో మొదలవుతుంది. క్రమంగా ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయబడుతుంది.

కారుణ్యం గలవారు:

ప్రేమ కూడా కలిగి ఉంటారు. ప్రేమ, కారుణ్యం ఒకే నాణెమునకున్న రెండు ముఖాలు.

ఇతరుల పట్ల కారుణ్యం తనలో కలిగినప్పుడు స్వార్ధం దానంతటదే విడిచి పెడ్తున్నదని గ్రహిస్తాడు. ఎలాగైతే ఉప్పు నీటిలో మంచి నీళ్ళు పోస్తున్న కొద్దీ ఆ నీటి ఉప్పదనం మాయమవుతుందో, మంచిని గురింని నిరంతరం ఆలోచించే వానిలో చెడు ధోరణులు మాయమవుతుంటాయి.

ఇతరుల కష్టనష్టాలు తనవిగా భావిస్తాడు. అటువంటి వారి మనస్సు విస్తారమై అంతటా ఐక్యతను చూస్తుంది.

దేహంలో ఒక భాగానికి నొప్పి కలిగితే, శరీరం మొత్తం ఆ నొప్పిని అనుభవిస్తుంది. ఒకే చైతన్యం అంతటా నిండి ఉన్నది కనుక, ఈ సృష్టిలో అతి చిన్నదైన ప్రాణి బాధను కూడా స్వయంగా అనుభవిస్తాడు.

బాధాతప్త మానవాళికి సహాయం అందించడానికి దాన ధర్మాలు చేస్తుంటాడు. మనస్సును ఆ పరమాత్మునికి అర్పించాలని చెప్పబడి ఉన్నది. అయితే మనస్సు ధనం మరియు ఇతర లౌకికమైన వస్తువులలో మునిగి ఉన్నది. లోకోపకారానికై తన ధనంలో కొంత శాతమైనా సరే ఉపయోగించడానికి ప్ర్రయత్నిస్తాడు.

కుష్టు రోగులు వంటి రోగగ్రస్థులను చూసి అతను అసహ్యపడడు. మనస్సును ఇంకా దృఢపరచుకోడానికి అతను అటువంటి వారికి చికిత్స జరుగుతున్న అసుపత్రులకు వెళ్ళి, తనలో నిర్మోహన్ని ఇంకా బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కారుణ్యం జనించినప్పుడు హృదయం మృదువుగా అవుతుంది. తద్వారా మనస్సుకు కూడా ఇది సహకరిస్తుంది.

పేదల పట్ల మనం చూపించే కారుణ్యం నిజానికి ఆ పరమాత్ముని పట్ల మనం చూపించగలిగే బాధ్యత. ఇదే ఆయనకు మనం చెయ్యగలిగే నిజమైన సేవ. నిరుపేదల పట్ల కారుణ్యం చూపించినప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం మనవైపు నిరాటంకంగా ప్రవహిస్తుంది.

ఒక ముష్టివానిపై చూపే కారుణ్యం, ప్రేమ మనకు ఆ పరమాత్మునిపై ఉన్న భక్తికి ప్రతీక.

కష్టాలను అనుభవిస్తున్న వారిని చూసినప్పుడు, ఇలా కష్టాలను అనుభవించడం అతని కర్మ అయితే అతనిపై ప్రేమ చూపిస్తూ అతనికి సేవను అందించడం నా ధర్మం అన్న భావన కలిగి ఉంటాడు.

నిరంతర జపం వల్ల కారుణ్యం మేల్కొంటుందని అతనికి తెలుసు. రామాయణం వ్రాసిన వాల్మీకి మహా ముని, ఒకప్పుడు గజదొంగ, నిరక్షరుడు మరియు సంస్కారం లేని వాడు. తీవ్రమైన ప్రయత్నంతో అయన మునీశ్వరుడు అయ్యాడు. బాధపడుతున్న మానవ జాతికి, తన కారుణ్యం కురిపించి వారికి వరప్రసాదమయ్యాడు. ఇదంతా సాధించగలిగింది అతను చేసిన నిరంతర జపసాధన వల్ల మాత్రమే.

కారుణ్యం అన్నది ఎవ్వరికీ హాని చెయ్యలేని నిరాటంకమైన ప్రవాహం. అహంకారానికి హాని కలిగించే స్వభావం ఉంది. అయితే ప్రేమ ఎప్పుడూ హాని చెయ్యదు. అదే విధంగా కారుణ్యం ఉన్న వారు ఎన్నడూ హాని చెయ్యరు.

మానవజాతి పట్ల ప్రేమ కారుణ్యాలు కలిగి ఉండే మహాత్ముల ఆదర్శాన్ని అనుకరిస్తూ, వారి మార్గదర్శకత్వంలో నడుస్తారు. బుద్ధి పరంగా అర్ధం చెసుకోలేనిది అని తెలుసుకుని ఎల్ల వేళలా ధ్యాననిరతులై గడుపుతారు.

పద్మాసనం వేసుకుని కూర్చున్న వారు, గ్రంథ జ్ఞ్నానం గురించి గర్వ పడేవారు, ధ్యానం మరియు జపం చెయ్యడంలో నేర్పరితనం ఉన్న వారి కంటే కూడా భగవంతునికి అధిక ప్రియమైనవారు కారుణ్యం గలవారు.

ప్రశ్న: సాధకులకు కోపం రాకూడదు అని ఎందుకు అంటారు?
అమ్మ: పిల్లల్లారా, ఆధ్యాత్మిక అన్వేషకునికి కోపం రాకూడదు. కోపం వచ్చినప్పుడు మనం సాధనద్వారా పొందిన శక్తినంతటినీ నష్టపోతాము.  కేవలం మన నోటి ద్వారానే కాదు మనం శక్తిని కోల్పోయేది, మన ప్రతి రంధ్రము నుండి కూడా శక్తిని నష్టపోతుంటాము. సిగరెట్టు లైటరు 10-20 మార్లు ఉపయోగిస్తే దానిలో ఉన్న ఇంధనం ఖర్చు అవుతుంది. ఇది కనిపించనప్పటికీ మనకు తెలుసు. పిల్లల్లారా, అదే విధంగా ఉన్నతమైన ఆలోచనల ద్వారా సంపాదించిన శక్తిని వివిధ కారణాల ద్వారా మనం కోల్పోతుంటాము. ఇది మనం గుర్తు చేసుకుంటుండాలి.

ప్రశ్న: అమ్మా, ఎన్నో సంవత్సరాలుగా నేను ఆధ్యాత్మిక అనుష్ఠానాలు చేస్తున్నప్పటికీ నాకింతవరకు ఎటువంటి అనుభవమూ కలుగలేదెందుకు?

అమ్మ: నాయనా, అమ్మ వద్దకు వస్తున్న చాలా మంది పిల్లలు ఈ విధంగా అమ్మకు చెప్తుంటారు. గృహస్థులైన అమ్మ పిల్లలు కూడా అమ్మకు చెప్తుంటారు, “ఎంతసేపు ధ్యానమూ, జపమూ చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి మేలు కనిపించడం లేదు” అంటూ. పిల్లల్లారా, ప్రార్థనలు చెయ్యడానికిగాను మనం భక్తితో ఆలయాలకు వెళ్తాము, గుడిలో విగ్రహానికి ముమ్మారు ప్రదక్షిణం చేస్తాము. మనం విగ్రహం ముందు నిలబడి ప్రార్థిస్తుండగా మన ముందు ఎవరైనా వచ్చి నిలబడితే వారిపై మండిపోతాము; అప్పటివరకు మనకు లభించిన ఏకాగ్రతవల్ల వచ్చిన ఫలితానికి దాదాపు రె౦డు రెట్లు నష్టపోతాము. గుడినుండి బయటకు వస్తున్నప్పుడు గుడి ముందు బిచ్చమెత్తుకోడానికి కూర్చున్న ముష్టివాడిని కాలితో తన్నడానికి కూడా సందేహించము. ముష్టివానిపై చూపించగలిగే కారుణ్యంవల్లనే ఆలయంలో ఉన్న విగ్రహంయొక్క అనుగ్రహాన్ని సంపాదించేందుకు అర్హతను పొందుతాము. కనుకనే మనకు ఆ అనుగ్రహం లభించదు. అటువంటప్పుడు ఆధ్యాత్మిక అనుభవాలు ఎలా కలుగుతాయి? మారువేష౦లో ఆ పరమాత్ముడు స్వయంగా వస్తే కూడా ఆయనపై కోపగించుకుంటామేమో! ఇలా ఉంటుంది మన స్వభావం. పిల్లల్లారా, అటువంటప్పుడు మనం సాధనయొక్క ఫలితాన్ని ఎలా పొందగలుగుతాము?

నా ముద్దుబిడ్డల్లారా, ఆ పరమాత్ముని చేరే దారి మనసుయొక్క ప్రశాంతతలో ఉంది. మనం ఆ భగవంతునికి చేరువలో ఉండాలంటే, అందరినీ సమానంగా చూడగలగాలి. అందరిపట్లా ఒకేరకమైన ప్రేమను చూపగలిగినప్పుడు మాత్రమే ఆ పరమాత్ముడు మనను స్వీకరిస్తాడు. ఆ పరమాత్మునికి ’పెద్ద’, ’చిన్న’ భావాలు లేవు. ఆయనకి అందరూ సమానమే.

ఈ ప్రపంచంనుండి ఏదైనా పొందాలనుకుంటే, ఎవ్వరి పరామర్శగాని, ఎవ్వరివద్దనుండి పుచ్చుకున్న యోగ్యతాపత్రం యొక్క అవశ్యంగాని లేదు. అయితే ఆ పరమాత్ముని సన్నిధానానికి చేరాలంటే, అందరిముందు తల వంచడానికి సిద్దంగా ఉండాలి, చివరికి ఒక చీమ ముందు సహితం. ఆ పరమాత్మునివద్దకు తీసుకువెళ్ళే ఎన్.ఒ.సి. (No Objection Certificate) సర్టిఫికెట్టు లభించాలంటే చివరికి ఒక చీమ వద్దనుండి కూడా సర్టిఫికెట్టు కావాలి. అప్పుడు మాత్రమే ఆ పరమాత్ముడు మన మనస్సులను ఆత్మతలానికి తీసుకువెళ్తాడు. అలాంటప్పుడు మనకు సమస్త జీవరాశిపట్ల కారుణ్యం మరియు విశాల మనస్సు ఉండి తీరాలి.

పిల్లల్లారా, ప్రతి వ్యక్తీ తాను కల్పించుకున్న విశ్వంలో తాను ఎంతో పెద్దవాడినని భావిస్తాడు. చివరికి ఒక దోమ కూడా అలానే తలుస్తుంది. స్నేహితులైన ఇద్దరు జ్యోతిష్యులు ఉండేవారు. వారి పునర్జన్మ గురించి తెలుసుకోవాలని జ్యోతిష్యపరమైన కొన్ని లెక్కలు కట్టి చూశారు. వారిలో ఒకడు దోమగాను, మరొకడు ఆవుగాను జన్మిస్తారని, వారిద్దరు కలుసుకుంటారని గ్రహించారు. దోమగా పుట్టబోయేవాడు ఆవుగా పుట్టబోయేవాడితో, “వచ్చే జన్మలో మనం కలుసుకున్నప్పుడు, నువ్వు నన్ను కాలితో తొక్కి వెంటనే చంపాలి. అప్పుడు ఆ హీనజన్మనుండి ముక్తి లభించి, ఆ పరమాత్మను వెంటనే చేరుకుంటాను” అన్నాడు.

అతని స్నేహితుడు సరేనని ఒప్పుకున్నాడు. ఇద్దరూ మరణించిన తరువాత అనుకున్నట్లుగా ఒకడు దోమగానూ, మరొకడు ఆవుగానూ జన్మించారు. ఆవుకు తన పూర్వజన్మ గుర్తుంది. చాలా కష్టపడి దోమగా పుట్టిన తన స్నేహితుడు జీవిస్తున్న మురికి కాలువను వెతికి పట్టుకుంది. గత జన్మలో ఒప్పందం ప్రకారం ఆ ఆవు దోమను తన కాలుతో చంపుదామని ముందుకు నడిచింది. ఉన్నట్లుండి ఆ దోమ గట్టిగా రోదించసాగింది, ’ఎంత క్రూరమైన చర్యకు తలపడుతున్నావు?’ అంటూ ఆవుని నిలదీసింది.

’ఈ దోమ జీవితాన్ని జీవించలేనని, ఈ హీనజన్మ నుండి రక్షించమని క్రిందటి జన్మలో నువ్వు నన్ను అడిగావు కదా?’
ఆవు పలికిన ఈ మాటలు విన్న దోమ వెక్కిరింతగా, ’మంచి పరిహాసమే. ఇది హీనమైన బ్రతుకు అంటున్నావా? నాది ఎంత ఆనందమైన, అందమైన జీవితమో నువ్వు గ్రహించగలవా? నాకు ఒక అందమైన భార్య, ముద్దుగొలిపే పిల్లలు ఉన్నారు. ఆ పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలన్న ఆత్రుత నాకు లేదు. అంతే కాదు, ఇంతకంటే గొప్ప లోకం ఉంటుందని నేననుకోవడం లేదు. నేను ఇక్కడే, ఇలాగే జీవితం గడపదలుచుకున్నాను.’ అంది. పిల్లల్లారా, మనలో ప్రతి ఒక్కరివీ ఇటువంటి కథలే.

దోమకు కూడా దాని బ్రతుకు ఎంతో గొప్పది. అదే విధంగా, లౌకిక జీవితంలో మునిగిపోయిన మనము కూడా ఇదే ఉత్తమమైనదిగా భావిస్తుంటాము. మానవ జన్మ ఎత్తిన మృగాలు మాత్రమే లౌకిక జీవితం ఉత్తమమైనదని అనగలరు. పిల్లల్లారా, లౌకిక జీవితం ద్వారా లభించే ఆనందం ఆ దోమకు లభించిన ఆనందంవంటిదే. ఆ పరమాత్ముని శరణుజొచ్చినప్పుడు మాత్రమే జనన మరణాలతో కూడిన ఈ దుఃఖమయ సంసారంనుండి ముక్తిని పొంది, సత్యమైన పరమానందాన్ని చవిచూడగలుగుతాము.