“దేవుడున్నాడా? ఉంటే ఎక్కడున్నాడు?” అని ఎందరో ప్రశ్నిస్తూంటారు. “కోడి ముందా, గ్రుడ్డు ముందా? కొబ్బరికాయ ముందా, కొబ్బరిచెట్టు ముందా?” అని వారిని అడగండి. అటువంటి ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు? కానీ, కొబ్బరికాయకి కొబ్బరిచెట్టుకి అతీతంగా, సర్వానికీ ఆధారమైన శక్తి ఒకటుంది. అదే భగవంతుడు. వాక్కుకి అతీతమైన, వ్యక్తపరచలేని ఒక విశేష శక్తి! సర్వానికీ బీజకారణం అయిన దాన్నే, పిల్లలారా, భగవంతుడు అంటారు.

పిల్లలారా, దేవుడు లేడనటం తన నాలుకతో “నాకు నాలుక లేదు” అన్నట్లే ఉంటుంది. ఏ విధంగా చెట్టు విత్తులో ఇమిడి ఉన్నదో, వెన్న పాలలో వ్యాపించి ఉన్నదో, అదే విధంగా భగవంతుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు.

విత్తులో చెట్టు ఉన్నప్పటికీ, చెట్టుగా అవ్వాలంటే, అది మట్టిలోనికి వెళ్ళి చిగురించి రావాలి. దాసభావము రావాలి. గ్రుడ్డులో నుండి పిల్ల పుట్టాలంటే కోడి పొదగాలి – అంత ఓర్పు కలిగి ఉండాలి. పాలను తోడుపెట్టి, పెరుగు అయ్యి, చిలికినాక మాత్రమే వెన్న వస్తుంది – భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ, ఆయన్ను మన అనుభవానికి తెచ్చుకోవాలంటే దృఢ ప్రయత్నము అవసరం.

అహంభావము, స్వార్థపరత్వము ఉన్నచోట భగవంతుడు కానరాడు. మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తే భగవంతుడు మనవైపు ఒక అడుగు వేసినట్లైతే, స్వార్థపరత్వం చూపిస్తే మన నుండి వేయి అడుగులు దూరంగా వెళ్ళిపోతాడు. బావిలో దూకడానికి ఒక్కక్షణం చాలు, కానీ పైకి రావడం కష్టం. అదేవిధంగా భగవదనుగ్రహం పొందటం ఎంతో కష్టం. దాన్ని వృధాచేయడానికి ఒక్కక్షణం చాలు.

భగవంతుని కోసం తీవ్ర వ్యాకులత, భగవంతుని పట్ల నిష్కళంకమైన ప్రేమ లేనట్లైతే ఎన్ని జన్మలు తపస్సు చేసినప్పటికీ, భగవంతుడిని పొందుట సాధ్యము కాదు పిల్లలారా.

ఒకే స్త్రీని సోదరుడు తన సోదరిగాను, భర్త తన భార్యగాను, తండ్రి తన బిడ్డ గాను చూస్తారు. ఎవరు ఏ విధంగా ఆమెను చూసినా ఆ స్త్రీ ఒక్కటే. అదేవిధంగా, భగవంతుడు కూడా ఒక్కడే. ఒక్కొక్కరి మనోభావాన్ని బట్టి వివిధ భావాలు కనపడతాయి.

భగవంతుడు ఏ రూపాన్నయినా ధరించగలడు. మట్టి మట్టిగానే ఉంటుంది; అదే ఏనుగు, గుఱ్ఱం వంటి బొమ్మలుగా అవుతుంది. ఈ బొమ్మలన్నీ ఆ మట్టిలో ఉన్నవే. ఇలాగే చెక్క కూడా. చెక్కనుండి ఏ రూపాన్ని అయినా చెక్కవచ్చు. కానీ చెక్కని చెక్కలాగా చూస్తే అది చెక్కే. అదే విధంగా, భగవంతుడు సర్వవ్యాపకుడూ, నిర్గుణుడు. అయినప్పటికీ మీరు ఎలా భావన చేస్తారో, అదే విధంగా మీకు దర్శనమిస్తాడు.

పిల్లలారా, భగవంతుడు తన సంకల్ప మాత్రంచేత ఏ రూపాన్నయినా ధరించగలడు. తిరిగి మరల తన పూర్వస్థితిని చేరుకోగలడు; నీరు మంచుగడ్డగా మారి, మరల కరిగి నీరుగా మారినట్లు.

పలుచోట్ల నుండి ప్రవహించే నీరు, ఒక ఆనకట్ట నిర్మించుట ద్వారా రిజర్వాయర్‌లో నిలువ చేయబడుతుంది. ఆ ఆనకట్టనుండి వెలువడే జలపాతం యొక్క ఉధ్రుతి ద్వారా విద్యుదుత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా, ఇంద్రియ విషయాలలో సంచరించే మనస్సును ఏకాగ్రం చేసినట్లైతే, ఆ ఏకాగ్రతాశక్తి ద్వారా భగవద్దర్శనాన్ని పొందవచ్చు.

పిల్లలారా, మనం భగవంతుని అభయం పొందిన తరువాత ఇక భయపడవలసినదేమీ లేదు. అన్ని విషయాలు భగవంతుడే చూసుకుంటాడు. పిల్లలకు ఒక ఆట ఉంది (దొంగాట లేక అంటుకునే ఆట వంటిది). చాలామంది పిల్లలు చేరి తమలో ఒకరి చేతి మీద కొడతారు. ఆ కొట్టబడ్డ బాలుడు మిగిలిన వారిని అంటుకోవడానికి వెంటపడతాడు. మిగిలిన వారంతా దొరకకుండా తప్పించుకోవడానికి పరిగెడతారు. ముందే అనుకున్న చెట్టును పట్టుకున్నట్లైతే, అంటుకోవడానికి వెంటపడుతున్న బాలుడు వారినేమీ చెయ్యలేడు. అదేవిధంగా, మనం భగవంతుడిని పట్టుకున్నట్లైతే ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు.

తండ్రియొక్క చిత్రపటాన్ని చూసినప్పుడు కొడుకు చిత్రకారుని గురించో, లేక పెయింటు గురించో ఆలోచించడు. అతనికి తన తండ్రే ఙ్ఞప్తికి వస్తాడు. అదేవిధంగా ఒక భక్తుడు దైవ విగ్రహాలలో భగవంతుడినే దర్శిస్తాడు. విశ్వపితనే చూస్తాడు. నాస్తికులు ‘విగ్రహాన్ని చెక్కిన శిల్పిని పూజించాలి కాని విగ్రహాన్ని కాదు’ అని అనవచ్చు. వారికి భగవంతునిలో నమ్మకం మరియు విగ్రహారాధన వెనుకనున్న తత్త్వంపై సరియైన అవగాహన లేదు కనుకనే, పిల్లలారా, వారు అలా అంటారు.

లోకంలో కనపడే సమస్యలకు భగవంతుడిని నిందించుటలో అర్థం లేదు. ‘మీరు ఈ రీతిలో నడుచుకోవాలి’ అని భగవంతుడు చెప్పాడు. దానికి విరుద్ధంగా నడుచుకోవటం వల్ల కలిగే సమస్యలకు భగవంతుడు బాధ్యుడు కాడు. ఆయనని తప్పుపట్టటం సరికాదు. ‘కొలను అంచున తిరగకూడదు, నిప్పుని తాకకూడదు’ అని తల్లి బిడ్డకు నేర్పిస్తుంది. అది అనుసరించకుండా బిడ్డ కొలనులో పడితే లేక చేయి కాల్చుకుంటే, తల్లిని తప్పుపట్టటం ఎందుకు?

“అంతా భగవంతుడే చేస్తాడు” అని చెప్పి కూర్చునేవారు సోమరులు. భగవంతుడు మనకు ఇచ్చిన బుద్ధి, ప్రతిఒక్క పనినీ వివేకంతో చేయుట కొరకే. భగవంతుడే అంతా చూసుకునేటట్లైతే, మనకు బుద్ధి యొక్క అవసరం ఉండేది కాదు కదా?

“అంతా భగవత్సంకల్పమే అయినట్లైతే, మనతో తప్పులు చేయించే వాడు కూడా భగవంతుడే కాడా?” అని అనడంలో అర్థం లేదు. ‘నేను’ అనే భావన ఉన్నవాడు అతను చేస్తున్నవాటికన్నింటికీ ఉత్తరవాది తను మాత్రమే. భగవంతుడు కాదు. తప్పులు చేయించేవాడు భగవంతుడే అని మనం నిజంగా విశ్వసించినట్లైతే, మనకి ఉరిశిక్ష విధించినది కూడా భగవంతుడే అని చూడగలగాలి. ఇది మనకు సాధ్యమేనా?

పిల్లలారా, భగవత్సాక్షాత్కారము మరియు ఆత్మసాక్షాత్కారము రెండూ ఒక్కటే. అందరినీ ప్రేమించగల్గుట, విశాల హృదయము, సమత్వ భావము – ఇదే భగవత్సాక్షాత్కారము.

ఈ విశ్వంలోని సకల చరాచరములు మనల్ని ప్రేమించినప్పటికీ, ఆ ప్రేమ భగవత్ప్రేమ నుండి ఒక్క క్షణంలో మనం పొందే పరమానందములో కోటిలో ఒకటవ వంతు కూడా సరితూగలేదు. పిల్లలారా, భగవత్ప్రేమ నుండి మనం పొందే ఆ పరమానందము అంత గొప్పది. భగవత్ప్రేమతో పోల్చదగిన ఇంకొక ప్రేమ ఏదీ లేదు.

భగవంతుడు కనిపించనంత మాత్రం చేత లేడని అనవచ్చా? ఎంతోమంది తమ తాతలను ఎప్పుడూ చూచి ఉండకపోవచ్చు. అంతమాత్రము చేత వారు తమ తండ్రిని తండ్రి తెలియనివాడు అని పిలుస్తారా?

చిన్నతనంలో అమ్మని ఒక్కో విషయం అడుగుతూ సహకరిస్తూ జీవించాము. కొంత పెద్దయిన తరువాత స్నేహితుడితో స్నేహితురాలితో మన సమస్యలను చెప్పుకున్నాము. ఇంకొంచెం పెద్దయిన తరువాత భార్యతో చెప్పుకుంటాము. ఈ సంస్కారమే మనలో ఉన్నది. ఇది మారాలి. ఒక విశాలమైన సంకల్పశక్తితో మన దుఃఖాలను పంచుకోగలగాలి. దుఃఖాలను వేరొకరితో పంచుకున్నప్పుడే మనకు ఉపశమనము కలుగుతుంది. ఒక తోడు లేకుండా పెరగటం సాధ్యంకాదు. ఆ తోడు భగవంతుడు అయ్యి ఉండాలి.

నేటి మిత్రుడు రేపటి శత్రువు కావచ్చు. మనం శరణు పొందదగిన నమ్మదగిన ఏకైక మిత్రుడు భగవంతుడు మాత్రమే.

మనకు భగవంతునిపై నమ్మకం ఉంటే, దాని వలన భగవంతునికేం లాభం? సూర్యునికి కొవ్వొత్తి కాంతి అవసరమా? నమ్మిన వారికి మాత్రమే ప్రయోజనం. నమ్మకంతో, గుడిలో ప్రార్థించినప్పుడు, భగవంతునికి కర్పూర ఆరతినివ్వటం చూసినప్పుడు, మన మనస్సే ఏకాగ్రతనీ, శాంతిని పొందుతుంది.

ఒక్కో మతస్థుడు తమ తమ ప్రార్థనామందిరాలలో తమ తమ సంప్రదాయాలను అనుసరించి భగవంతుడిని ఆరాధిస్తారు. అయినప్పటికీ భగవంతుడొక్కడే. ‘పాలు’ అని అన్నా, ‘మిల్కు’ అని అన్నా, ‘దూద్’ అని అన్నా పాలయొక్క గుణము, రంగు మారవు. క్రైస్తవులు క్రీస్తు అని, మహమ్మదీయులు అల్లా అని పిలుస్తారు. శ్రీకృష్ణుని రూపం కూడా కేరళలో లాగా ఉత్తర భారతదేశంలో ఉండదు. వారి కృష్ణునికి తలపాగా వగైరా ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి, అభిరుచులకు అనుగుణంగా భగవంతుడిని భావించి పూజిస్తారు. మహాత్ములు కాలానుగుణంగా ఏకమైన ఈశ్వరతత్వాన్ని ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రూపాలలో వ్యక్తపరిచారు.

కాలిపోతున్న ఇంటిలో చిక్కుపడినవాడో లేక ఈత రాక లోతయిన నీటిలో మునిగిపోతున్నవాడో, తన జీవితాన్ని రక్షించుకోవటానికి ఏ విధంగా తహతహలాడతాడో, ఈ శరీరం నుండి ఆత్మ జ్యోతిని చేరుకోవటానికి ఆ విధంగా తహతహలాడాలి. అటువంటి తీవ్రమైన వ్యాకులత ఉన్నవాడు భగవద్దర్శనం కోసం ఎక్కువ కాలం నిరీక్షించవలసిన అవసరం లేదు.

పిల్లలారా, తాళంచెవి పోగొట్టుకుంటే, ఆ తాళం తీయించడానికి మనం కమ్మరి కొలిమికి వెళతాము. రాగద్వేషాలనే (బంధనరూపమైన) తాళాన్ని తీయాలంటే, దాని తాళంచెవి భగవంతుని చేతిలో ఉంది.

భగవంతుడే సర్వానికి ఆధారము. భగవంతునిపై ఉన్న విశ్వాసంనుండి ప్రేమ వృద్ధి అవుతుంది. ప్రేమ వలన ధర్మబోధం వస్తుంది. నీతి కలుగుతుంది. శాంతిని అనుభవించగలము. మన చెయ్యి కాలినప్పుడు మందు రాయడానికి ఎంత ఆతురతతో ఉంటామో, అదే విధమైన ఆతురతతో ఇతరుల దుఃఖాల పట్లా కరుణ చూపించాలి. భగవంతునిపై పూర్తి విశ్వాసం ద్వారా ఇది పొందవచ్చు.

మనకు అవసరమున్న వస్తువులన్నీ ఉన్న దుకాణమేదో తెలిసిన తరువాత, పిల్లలారా, బజారులో ఉన్న అన్ని దుకాణాల్లో తిరుగుట ఎందుకు? దాని వలన ఉపయోగం లేకపోగా సమయం కూడా వృధా అవుతుంది. అదే విధంగా, మనకు గురువు లభించినట్లైతే ఇక వృధా సంచారాన్ని చాలించి, గమ్యం చేరుటకు శ్రమిస్తూ సాధన చేయాలి.

సాధకుని దగ్గరకు గురువు తానే వస్తాడు. అన్వేషించవలసిన అవసరం లేదు. సాధకుడు అటువంటి వైరాగ్యమున్నవాడు మాత్రం అయ్యుండాలి.

ఒక సాధకునికి గురువు తప్పకుండా అవసరము. బిడ్డ కొలను అంచుకు వెళ్ళినట్లైతే తల్లి అపాయన్ని చూపించి, అక్కడి నుంచి వెనక్కి తిరిగేలా చేస్తుంది. అదేవిధంగా, గురువు, శిష్యునికి అవసరమైన రీతిలో మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు. గురువు దృష్టి ఎల్లవేళలా శిష్యునిపై ఉంటుంది.

పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పటికిని, గురువు యొక్క సన్నిధి విశిష్టమైనది. అంతటా గాలి వీస్తున్నప్పటికిని, చెట్టుక్రింద కూర్చున్నప్పుడు ఉన్న చల్లదనం వేరే చోట ఉండదు. చెట్ల ఆకుల నుండి వస్తున్న గాలి, మండుటెండలో ఉన్న మనకి చల్లదనాన్ని ఇవ్వటం లేదా? అదే విధంగా ప్రాపంచిక జీవితంయొక్క వేడిలో ఉన్న మనకు గురువు యొక్క అవసరమున్నది. గురువుయొక్క సన్నిధి మనకు అంతఃశాంతి మరియు సామరశ్యాన్ని కలిగిస్తుంది.

పిల్లలారా, మలము ఎంతకాలము ఎండలో ఉన్నప్పటికీ, దుర్గంధం పోవాలంటే దాని పై నుండి గాలి వీయాలి. ఇదే విధంగా, అనేక సంవత్సరాలపాటు ధ్యానం చేసినప్పటికీ, చెడు సంస్కారాలు తొలగింపబడాలంటే గురువు సాన్నిధ్యంలో జీవించాలి. గురుకృప ఆవశ్యకము. నిష్కళంకమైన మనస్సుకు మాత్రమే గురువు కృపని అనుగ్రహిస్తాడు.

ఆధ్యాత్మికంగా పురోగమించుటకు, గురువు పట్ల మనం పూర్తి ఆత్మార్పణ భావం కలిగి ఉండాలి. ఒక బాలుడు అక్షరం నేర్చుకునేటప్పుడు, ఉపాధ్యాయుడు అతని వేలు పట్టుకొని ఇసుకలో ఆ అక్షరాన్ని వ్రాయిస్తాడు. బాలుని వేలు యొక్క కదలిక పూర్తిగా ఉపాధ్యాయుని నియంత్రణలో ఉంటుంది. కానీ ఆ బాలుడు ’నాకంతా తెలుసు’ అనే భావనతో, ఉపాధ్యాయుని మాట వినటానికి నిరాకరిస్తే, ఏ విధంగా నేర్చుకోగలడు?

పిల్లలారా, స్వానుభవమే ప్రతి వ్యక్తికీ నిజమైన గురువు. దుఃఖమే మనల్ని భగవంతునికి సమీపంగా తీసుకొనివెళ్ళే గురువు.

గురువు పట్ల శిష్యుడు భయభక్తులు కలిగి ఉండాలి. అదే సమయంలో గురువు నా స్వంతమే అన్నంత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. తల్లి ఎంత కొట్టినా, దూరంగా త్రోసివేసినా కూడా బిడ్డ తల్లిని కరచుకొని ఉండేటటువంటి బంధంలాగా ఉండాలి అది. భయభక్తులు మన ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడతాయి. కానీ నిజమైన మేలు గురువుతో ఉన్న సన్నిహిత సంబంధం ద్వారానే పొందగలము.

పిల్లలారా, మీరు మీ గురువుని ప్రేమించినంత మాత్రం చేత మీ వాసనలు నశించవు. మీరు ఆధ్యాత్మిక తత్వాలపై ఆధారపడినటువంటి భక్తివిశ్వాసములు కలిగి ఉండుట అవసరము. వాటిని అభివృద్ధి పరచుకునేందుకు దేహ, మనో, బుద్ధులను అర్పణ చేయుట అవసరము. గురువుపట్ల సంపూర్ణ భక్తి, విధేయతలను పెంపొందించుకున్న చాలు, అదే వాసనలను తొలగిస్తుంది.

నిజమైన గురువులు శిష్యునియొక్క ఆధ్యాత్మిక ప్రగతిని మాత్రమే ఆశిస్తారు. పరీక్షలు శిష్యుని అభివృద్ది కొరకే. అతనిలో ఉన్న బలహీనతలను తొలగించటనికే. శిష్యుడు చేయని తప్పులకు కూడా గురువు అతనిని నిందించవచ్చు. అటువంటి పరీక్షలను నిశ్చలంగా భరించగలిగిన వారు మాత్రమే పురోగమించగలరు.

నిజమైన గురువుని అనుభవము ద్వారా మాత్రమే తెలుసుకోవడం సాధ్యం.

కృత్రిమంగా పొదుగబడిన కోడిపిల్లలకు సరియైన ఆహార, వాతావరణాలు కల్పించకపోతే చనిపోతాయి. కానీ నాటు కోడిపిల్లలు ఆహార, వాతావరణాలు ఎలా ఉన్నా బ్రతుకుతాయి. పిల్లలారా, సద్గురు సన్నిధిలో జీవించే సాధకుడు ఈ నాటు కోడిపిల్లల వంటి వారు. వారు ఎటువంటి పరిస్థితినైనా అధిగమించుటకు ధైర్యము కలిగి ఉంటారు. ఏదీ వారిని లోబరుచుకోలేదు. సద్గురు సన్నిధిలో జీవించిన సాధకులు ఆ సాన్నిహిత్యం నుండి పొందిన శక్తిని ఎల్లవేళలా కలిగి ఉంటారు.

ఒక శిష్యుడు తన గురువుపట్ల స్వకీయమైన వైఖరి కలిగి ఉండవచ్చు. ఈ వైఖరి అంత సులభముగా నశించదు. ఒక శిష్యుడు తన గురువుయొక్క అత్యున్నత ప్రేమను తను మాత్రమే పొందాలని ఆశించవచ్చు. అది పొందటంలేదని అనిపించినప్పుడు, గురువుని దూషించి విడిచిపెట్టి పోయే శిష్యులు కూడా ఉన్నారు. గురుప్రేమ కావాలనుకుంటే నిస్వార్ధంగా సేవచేయటం నేర్చుకోవాలి.

భగవంతుని ఉగ్ర కోపమును శమింపజేయవచ్చును. కానీ గురు నింద ద్వారా వచ్చిన పాపాన్ని భగవంతుడు కూడా క్షమించడు.

గురువు, దేవుడు అందరిలోనూ ఉన్నారు. కానీ సాధన యొక్క ఆరంభదశలలో బాహ్య గురువు అవసరము. ఒక స్థాయిని చేరిన తరువాత దాని అవసరము ఉండదు. ఆ తరువాత ప్రతి ఒక్క వస్తువు నుండి ముఖ్యమైన ఆధ్యాత్మిక తత్వాలను గ్రహిస్తూ తమంతట తాముగా ముందుకు సాగగలరు. ఒక బాలుడు లక్ష్యబోధం కలిగేంతవరకు ఇంట్లోనివారు మరియు ఉపాధ్యాయుల భయం వల్లనే పాఠాలు చదువుతాడు. ఒక్కసారి లక్ష్యబోధం కలిగిన తరువాత, సినిమాలు చూడకుండా, నిద్రపోకుండా, కూర్చుని చదువుతాడు. అంత వరకూ తన ఇంట్లోనివారి పట్ల ఉన్న భక్తి అతని బలహీనత కాదు. పిల్లలారా, లక్ష్యబోధం కలిగినప్పుడు, అతనిలో ఉన్న గురువు కూడా తనంతట తానే మేల్కొంటాడు.

ఒక వ్యక్తి గురు సన్నిధిలోకి వచ్చినప్పటికీ, అర్హత కలిగిఉన్నట్లైతేనే గురువు అతడిని స్వీకరిస్తాడు. కానీ గురుకృప లేకుండా ఎవరూ గురువుని తెలుసుకోలేరు. సత్యాన్వేషి వినయము, నిష్కపటత్వం కలిగి ఉంటాడు. అటువంటి వానిపై మాత్రమే, గురువు, కృపని అనుగ్రహిస్తాడు. అహంభావంతో గురువుని సమీపించేవాడు గురువుని ప్రాప్తించుకోవటం సాధ్యము కాదు.

పిల్లలారా, ’భగవంతుడు, నేను ఒక్కటే’ అని అనవచ్చు. కానీ, ఒక శిష్యుడు ’గురువు, నేను ఒక్కటే’ అని ఎన్నటికీ అనలేడు. ’నాలో నేను’ మేల్కొలిపినవాడు గురువే కదా. ఆ అనుపమానమైన మహత్వం ఎప్పుడూ ఉంటుంది. శిష్యుని నడవడి దానికి అనుగుణంగా ఉండాలి.

ఎగురలేని తన కోడిపిల్లలను తల్లికోడి ఏ విధంగా తన రెక్కల క్రింద ఉంచి రక్షిస్తుందో అదే విధంగా సద్గురువు కూడా తన నియంత్రణలో నడచువారి పూర్తి సంరక్షణ వహిస్తాడు. శిష్యుల యొక్క అతి చిన్న పొరపాట్లను కూడా అప్పటికప్పుడే ఎత్తిచూపి వాటిని సరిదిద్దుతాడు. తన శిష్యులలో రవ్వంత కూడా అహాన్ని పెరుగనివ్వడు. అందుకోసం గురువులు ఒక్కొక్కసారి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించవచ్చు.

వేడెక్కిన ఇనుపముక్కని తన సమ్మెటతో కొడుతున్న కంసాలిని చూచిన జనం అతడు నిర్దయుడని అనుకోవచ్చు. ఆ ఇనుపముక్క కూడా వీడంత క్రూరుడు మరొకడుండడని అనుకోవచ్చు. కానీ ప్రతి దెబ్బ కొడుతున్నప్పుడు ఆ కంసాలివాని దృష్టి, దాని వలన వెలువడే కొత్త రూపంపైన మాత్రమే ఉంటుంది. పిల్లలారా, నిజమైన గురువు కూడా అటువంటివాడే.

పిల్లలారా, మీకు జన్మనిచ్చిన తల్లి ఈ జన్మకి చెందిన అవసరాలను చూసుకోవచ్చు. ఈ రోజుల్లో అది కూడా చాలా అరుదు. కానీ ఈ జన్మలోనే కాక భావిజన్మలన్నింటిలోనూ పరమానందప్రాప్తి పొందుటకు సరియైన మార్గమున మిమ్ము నడిపించుటయే అమ్మ లక్ష్యం.

పుండుని చిదిమి చీము తీసేటప్పుడు బాధ కలుగుతుంది. అలాగని నిజమైన వైద్యుడు చీము తీయక మానివేస్తాడా? అదే విధంగా మీ యొక్క చెడు సంస్కారాల్ని తొలగించేటప్పుడు బాధ కలుగుతుంది. అయినా అది మీ మంచికే. అంకురిస్తున్న మొక్కను నాశనం చేసే చీడను తొలగించినట్లుగా అమ్మ మీ చెడు సంస్కారాలను తొలగిస్తుంది.

అమ్మని ప్రేమించుట మీకు తేలికే కావచ్చు. కానీ అది చాలదు. వేరేవారిలోనూ అమ్మని దర్శించుటకు ప్రయత్నించండి. పిల్లలారా, అమ్మ ఈ ఒక్క దేహానికి మాత్రమే పరిమితమని భావించకండి.

పిల్లలారా, అమ్మని ప్రేమిస్తున్నారనటానికి అర్ధం, లోకంలోని సర్వజీవులను సమానంగా ప్రేమించుటయే.

అమ్మ తమ పట్ల ప్రేమను చూపినప్పుడు మాత్రమే అమ్మని ప్రేమించువారిది నిజమైన ప్రేమ కాదు. అమ్మ తిట్టినా తన్నినా కూడా అమ్మ పాదాలను విడువకుండా పట్టుకోగలిగిన వారిదే నిజమైన ప్రేమ.

ఈ ఆశ్రమంలో ఉంటూ అమ్మ యొక్క కార్యాచరణని గమనిస్తూ అర్థం చేసుకుని ముందుకి నడిచేవాడు ముక్తిని పొందగలడు. అమ్మ యొక్క మాటలను తలుచుకుంటుంటె ఇక ఏ ఒక్క ఆధ్యాత్మిక గ్రంధమును చదువవలసిన అవసరం లేదు.

మనస్సుకు ఒక ఆలంబన అవసరం. కానీ విశ్వాసము లేకపోతే అది సాధ్యము కాదు. ఒక విత్తుని నాటినపుడు దాని యొక్క పైపెరుగుదల, భూమి లోపలకి ప్రాకే వేర్ల యొక్క బలంపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసము లేకుండా యెదగడం సాధ్యము కాదు.

పిల్లలారా, మీరు అమ్మనో లేక స్వర్గంలో ఉన్న దేవుడ్నో నమ్మాలని అమ్మ చెప్పటం లేదు. మీపై మీకు నమ్మకం ఉంటే చాలు. అంతా మీలోనే ఉంది.

మీరు నిజంగా అమ్మను ప్రేమించినట్లైతే సాధన చేసి మిమ్ము మీరు తెలుసుకోండి. మీనుండి ఏమీ ఆశించకుండానే అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది. నా పిల్లలందరూ రేయింబగలు తేడాలేక ఎల్లప్పుడూ శాంతిననుభవించుట చూడగలిగినట్లైతే అమ్మకు అంతే చాలు.

మీరు ఎప్పుడైతే ఒక చీమపట్ల కూడా నిస్వార్ధమైన ప్రేమ కలిగి ఉంటారో, అప్పుడు మాత్రమే మీకు అమ్మ పట్ల నిజమైన ప్రేమ ఉందని అమ్మ భావిస్తుంది. అన్య విధములైన ప్రేమను అమ్మ నిజమైన ప్రేమగా ఎంచదు. స్వార్ధజనితమైన ప్రేమను చూసినప్పుడు అమ్మకి మంటల్లో నుంచున్నట్టు ఉంటుంది.

మీ ఆలోచనలు మరియు చేష్టలకనుగుణంగా అమ్మ స్వభావం మారుతూ ఉంటుంది. రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని మీదుకి గర్జిస్తూ దూకిన ఉగ్రనరసింహుడు, తన భక్తుడైన ప్రహ్లాదుని దగ్గర శాంతమూర్తి అయినాడు. పరిశుధ్ధుడు, గుణాతీతుడు అయిన భగవంతుడు, హిరణ్యకశ్యప, ప్రహ్లాదుల వేర్వేరు చర్యల కనుగుణంగా రెండు విరుధ్ధ భావాలను కనబరిచాడు. అదే విధంగా తన బిడ్దల యొక్క భావాలకనుగుణంగా అమ్మ స్వభావం మారుతూ ఉంటుంది. ’స్నేహమయి’ అని బిడ్డలు స్తుతించే అమ్మ ఒక్కొక్కసారి ’క్రూరమయి’గా కనుపించవచ్చు. ఇది నా పిల్లల నడతలోని లోపాలను సరిదిద్దుట కొరకే. వారిని మంచివాళ్ళుగా తీర్చిదిద్దుటే దాని ఉద్దేశ్యము.

5 ఏప్రిల్ 2011, కెన్యా

అమ్మ సన్నిధిలో, కెన్యా గణ తంత్ర రాజ్య ఉప రాష్ట్రపతి కలొంఝో మ్యుసియొక, “మాతా అమృతానందమయి మఠం – కెన్యా”చే నిర్మించబడిన నూతన బాలల గృహానికి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ అతీ నది ఒడ్డున నిర్వహించిన ఒక బహిరంగ కార్యక్రమంలో, ఉప రాష్ట్రపతితో పాటు చాలా మంది అతిథులు పాలు పంచుకున్నారు: క్రీడల మరియు సంస్కృతి సహాయ మంత్రి శ్రీమతి వావిన్యా న్దెతి, అనేక మంది పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టరు, కెన్యా ప్రసిద్ధ గాయకుడు శ్రీ ఎరిక్ వైనైన. మొట్టమొదట ఈ బాలల గృహం 108 మంది బాలలకు ఆశ్రయమవుతుంది.

ఈ బాల గృహంతో పాటు మరో రెండు పథకాలకు ప్రారంభోత్సవం చేయబడింది – అమృత వృత్తి శిక్షణా కేంద్రం మరియు అమృత త్రాగు నీటి సరఫరా పథకం.

అమృత వృత్తి శిక్షణా కేంద్రం, 35 కంప్యూటర్లతో, దగ్గరలో ఉన్న జాం నగరంలోని వెనుకబడిన ప్రజానీకానికి సేవలు అందిస్తుంది. ఈ కేంద్రపు మొదటి కోర్సులో 50 మందికి ప్రాధమిక కంప్యూటరు శిక్షణ ఇవ్వడం జరిగింది.

అమృత త్రాగు నీటి సరఫరా పథకం ద్వారా ప్రతి రోజూ బాలల కేంద్రం చుట్టు ప్రక్కల ఉన్న, తీవ్రమైన కరువుకు గురైన మసాయి ఆదివాసి ప్రజలకు పరిశుభ్రమైన త్రాగు నీరు సరఫరా చేయబడుతుంది.