ఒకరు పండిన పనసపండుని తినడానికి ఇష్టపడతారు. ఒకరు ఉడికించినది తింటారు, వేరొకరికి వేయించినది కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటే ఇష్టం. ఎట్లా తిన్నా ఆకలి తీరటమే లక్ష్యం. అదే విధంగా, భగవంతుడిని తెలుసుకోవటానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గం అనుసరిస్తున్నారు. పిల్లలారా, ఏ మార్గంలో వెళ్ళినా లక్ష్యం ఒక్కటే, భగవత్సాక్షాత్కారము.

తత్వజ్ఞాన రహితమైన భక్తి మనిషిని బంధించటానికి మాత్రమే సహాయ పడుతుంది. అది ముక్తుడిని చేయలేదు. వేర్లు విస్తరిస్తున్న మల్లెతీగ, వేరే చెట్టులను బంధించకుండా, పైకి పెరగలేదు.

భక్తి లేని జ్ఞానం, రాతిని కొరుక్కు తినటం వంటిది.

అనేక దేవుళ్లున్నారన్న భావం లేకుండా ఏకమైన భగవంతుని పట్ల నిస్వార్థ ప్రేమ కలిగి శరణు వేడుకోవటమే తత్వజ్ఞాన మూలమైన భక్తి. ‘నేను దీనికోసం వెళ్తున్నాను’ అనే లక్ష్యబోధం మనసులో ఉంచుకుని ముందుకు సాగాలి. తూర్పుకి వెళ్లవలసినవాడు పడమరకు పయనమై వెళ్తే అది ఫలించదు కదా.

పిల్లలారా, జీవిత లక్ష్యము భగవత్సాక్షాత్కారమే. దానికై శ్రమించండి. గాయపడినట్లైతే, గాయం పైనున్న మలినాన్ని కడిగిన తరువాత మాత్రమే మందు పూస్తాము. లేకపోతే చీము పడుతుంది. మానదు. అదే విధంగా, భక్తితో అహంకారాన్ని కడిగిన తరువాతే జ్ఞానాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక వికాసం వస్తుంది.

వెన్నను కరిగించి ఉంచితే అది చెడిపోదు. అది “నేను వెన్నని” అని చెప్పి గర్వంతో కరగడానికి నిరాకరించితే, అది దుర్గంధభరితమౌతుంది. కానీ, భక్తితో కరిగించితే దుర్గంధం రాదు. పిల్లలారా, కేవలం భక్తి వలన మాత్రమే గర్వము మరియు ఇతర కల్మషాలను కరిగించగలము.

కొంతమంది, అమ్మ ఎందుకు భక్తి మార్గానికి ప్రాముఖ్యతనిస్తుంది అని అడుగుతారు. పిల్లలారా, అద్వైతాన్ని స్థాపించిన శంకరాచార్యులు చివరకు భక్తిసంబంధితమైన సౌందర్యలహరిని వ్రాయవలసి వచ్చింది. బ్రహ్మసూత్రం రచించిన వ్యాస ముని భాగవతాన్ని రచించిన తరువాత మాత్రమే సంతృప్తి పొందారు. వేయికి ఒకరు లేక ఇద్దరు జ్ఞానమార్గం ద్వారా లక్ష్యాన్ని చేరుతూ కనపడతారు. మిగిలిన సాధకుల్ని అమ్మ విడిచిపెట్టగలదా? వారికి భక్తి మార్గము మాత్రమే ఉపకరిస్తుంది. బ్రహ్మసూత్ర్రాల్ని రచించటం వలన అద్వైతాన్ని గురించి మాట్లాడటం వలన, సామాన్య జనులకు అంతగా ఉపయోగకరముగా లేదని గ్రహించి, చివరకు వారు భక్తిసంబంధమైన గ్రంథాల్ని రచించారు.

భక్తి మార్గంలో మనం మొదటి నుండే ఫలాన్ని పొందగలము. పరమానందాన్ని అనుభవించగలము. తక్కిన మార్గాలలో చివరలో మాత్రమే పొందగలము. భక్తి యొక్క ఫలం, పనస చెట్టు నుండి పనస కాయ పొందటం వంటిది. క్రింద నుంచే, చెట్టు మొదలు నుంచే, కాయలు దొరుకుతాయి. కానీ మిగతా చెట్లలో, అధిక భాగం చెట్టు చివరి వరకు ఎక్కినప్పుడు మాత్రమే ఫలాన్ని పొందగలము.

మొదట్లో భగవంతుని పట్ల భయభక్తులు ఉండాలి. ఆ తరువాత అది అవసరం లేదు. సర్వోత్కృష్టమైన ప్రేమావస్థకు చేరినప్పుడు భయానికి తావులేదు.

ఎంత జపధ్యానాలు చేసినప్పటికీ భగవంతుని పట్ల ప్రేమ లేకపోతే పనికిరావు. ప్రవాహానికి ఎదురు పోతున్న పడవని ఎంత బలంగా తెడ్డు వేసినప్పటికీ చాలా నెమ్మదిగా మాత్రమే ముందుకి పోతుంది. కానీ తెరచాప కడితే ఎంతో వేగంగా పోవటం చూస్తాము. పడవని ముందుకి నడిపిస్తున్న తెరచాప వంటిది భగవంతుని పట్ల ప్రేమ. చాలా వేగంగా లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇది సహాయపడుతుంది.

‘కర్మలను ఆచరిస్తే చాలు, కర్మలను ఆచరిస్తే చాలు’ అని అందరూ అంటూ ఉంటారు. అయితే, కర్మలను ఆచరించాలంటే, తత్ సంబంధమైన జ్ఞానం అవసరం. జ్ఞాన రహితమైన కర్మలు సరైన కర్మలు కాలేవు.

శ్రధ్ధతో ఆచరించిన కర్మలు మనల్ని భగవంతుని వద్దకు చేరుస్తాయి. మనకు శ్రధ్ధ ఉండాలి. శ్రధ్ధ ద్వారానే ఏకాగ్రత కలుగుతుంది. కానీ, చాలా సార్లు, కర్మ చేసిన తరువాత మాత్రమే, మనం ముందుగా తీసుకొని ఉండవలసిన జాగ్రత్తల గురించి ఆలోచిస్తాము. సామాన్యంగా పరీక్ష హాలు నుండి బయటకు వచ్చిన తరువాత మాత్రమే మనం “అయ్యో, ఈ విధంగా రాసి ఉన్నట్లైతే బాగుండేది” అని ఆలోచిస్తాము. అయిపోయిన తరువాత ఆ విధంగా ఆలోచించుట వలన ప్రయోజనమేమిటి?

పిల్లలారా, ఏ కార్యం చెయ్యటానికైనా శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేకపోతే ఏ కర్మ చేసినా దాని వలన ప్రయోజనముండదు. అత్యంత శ్రధ్ధతో ప్రతి కార్యాన్ని చెయ్యటం వలనే, ఒక సాధకునికి ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన కార్యాల యొక్క వివరాలు కూడా జ్ఞాపకముంటాయి. ఎంతో అల్పమని అనిపించే కార్యాలను కూడా అత్యంత శ్రధ్ధతో మాత్రమే చెయ్యాలి.

సూది అల్పమైన వస్తువు అని మనకు అనిపించినప్పటికీ, దాన్ని పట్టుకున్నప్పుడు మనం చాలా శ్రద్ధతో ఉంటాము. మనం శ్రద్ధ చూపించకపోతే సూది బెజ్జములోకి దారాన్ని ఎక్కించలేము. కుట్టుపని చేసేటప్పుడు ఒక్క క్షణం మనం అశ్రద్ధగా ఉన్నట్లైతే, సూది మన వేలుకి గ్రుచ్చుకుంటుంది. సూదిని మనమెప్పుడూ నిర్లక్ష్యంగా క్రింద పెట్టము. సరిగా చూసి పెట్టకపోతే అది వేరేవారి కాలులో గ్రుచ్చుకుంటుంది. వారికి ప్రమాదమవుతుంది. సాధకుడు ఏ పని చేస్తున్నా ఇటువంటి శ్రధ్ధ తప్పనిసరిగా ఉండాలి.

ఏదైనా పని చేసేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే పనిలో ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేకుండా పని చేస్తే దాని వలన ప్రయోజనము లేదు. ఏ పని చేస్తున్నా మంత్రం జపించుట మరచిపోవద్దు. మంత్రం జపించటానికి సాధ్యపడనటువంటి పని అయితే, పని మొదలుపెట్టటానికి ముందు భగవంతునికి ప్రార్థన చేయండి. “భగవంతుడా, నీ పని నేను చేస్తున్నాను. అది చేయటానికి తగిన శక్తిని ప్రసాదించు, నీ శక్తితోనే నేను పని చేస్తున్నాను.” ఈ విధంగా మనస్సులో అనుకోవాలి.

ఏ పని చేస్తున్నా భగవంతుడిని సదా స్మరిస్తున్న వాడే నిజమైన కర్మయోగి; నిజమైన సాధకుడు. అతడు ఏ పని చేసినా అందులో భగవంతుడినే చూస్తాడు. అతని మనస్సు చేస్తున్న పనిలో ఉండదు, భగవంతునిలో లీనమై ఉంటుంది.

పూర్వ జన్మల సంస్కారములు కలిగిన అతి కొద్ది మంది మాత్రమే జ్ఞాన మార్గమును అనుసరించగలరు. యథార్థమైన గురువు ఉంటే ఏ మార్గమైనా ఫరవాలేదు. రూప ధ్యానంలో మనం మనల్నే ధ్యానిస్తున్నాము. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చినప్పుడు నీడ అసలు కనిపించదు. అదే విధంగా రూపధ్యానంలో కూడా. మనంతట మనమే దానిగా (ధ్యాన రూపంగా) మారుతాము. పూర్ణత్వంలోకి వచ్చినాక నీడ లేదు. ద్వంద్వం లేదు. మాయ లేదు.

మొదట బాహ్య విషయాలలో శ్రధ్ధ అవసరం. బాహ్య ప్రవర్తనలో శ్రధ్ధ లేకపోతే, ఆంతరిక స్వభావాన్ని జయించుట సాధ్యం కాదు.

 

పిల్లలారా, ఋషులయొక్క అనుభవమే శాస్త్రం. అది బుద్ధితో తెలుసుకోగలిగినది కాదు. అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము.

శాస్త్రం మహాసముద్రమువలె విశాలమైనది. అది అంతా మనకు అవసరము లేదు. సముద్రములోని రత్నాల వలె, శాస్త్రాలలోని తత్వములే మనకు అవసరము. చెరుకు తింటున్నవాడు రసాన్ని మాత్రమే తీసుకుంటాడు. పిప్పి ఉమ్మివేస్తాడు.

సాధన చేసినవాడు మాత్రమే శాస్త్రాలలోని సూక్ష్మాంశాలను గ్రహించగలడు.

శాస్త్రపఠనము మాత్రమే పరిపూర్ణత్వానికి దారి తీయదు. మందు సీసాపై ఈ విధంగా మందు తీసుకోవాలని వ్రాసి ఉంటుంది. రోగం నయమవటానికి మందులు తెచ్చుకున్నవాడు, అది చదివి కూర్చుంటే రోగం నయమవదు. కేవలం శాస్త్రపఠనము చేత ముక్తి లభించదు. అభ్యాసం కూడా కావాలి.

శాస్త్రం అభ్యసించకుండా చేసే ధ్యానం కంటే, శాస్త్రాభ్యాసంతో కూడిన ధ్యానము మేలైనది. మనస్సు కలత చెందినపుడు, శాస్త్రం పఠించినవాడు దుఃఖించకుండా తాను చదివిన ఆ శాస్త్ర వాక్యాలను మననం చేసుకుంటూ శక్తిని పొందగలడు. దుర్బలతను జయించుట సాధ్యమవుతుంది. సాధనను శాస్త్రపఠనంతో కలిపి చేసినవాడు మాత్రమే లోకానికి నిస్వార్థమైన సేవ చేయగలడు.

శాస్త్రపఠనం కొంతవరకు అవసరమే. వ్యవసాయాన్ని గురించి చదువుకున్నవాడు కొబ్బరి కాయను నాటి పెంచటానికి ప్రయాసపడనక్కరలేదు. ఎప్పుడైనా తెగులు లక్షణాలు కనిపించినట్లైతే దానికి ఎలా చికిత్స చేయాలో అతనికి తెలుసు. అంటే, కొబ్బరి కాయను చిత్రించి కూర్చుంటే దాహం తీరదు. కొబ్బరి కాయలను పొందాలంటే మెదట కొబ్బరి మొక్కను నాటి, దాని పోషణ చేయాలి. శాస్త్రంలో చెప్పినది అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, సాధన చేయటం తప్పనిసరి.

సాధన చేయకుండా కేవలం శాస్త్రపఠనంలో మాత్రమే సమయాన్ని గడిపేవాడు, ఇంటి నమూనా గీసి అందులో నివసించడానికి ప్రయత్నించే వాడిలాగా, మూర్ఖుడు.

దారి తెలుసుకుని వెళ్తే యాత్ర తేలికవుతుంది. పైగా గమ్యం త్వరగా చేరవచ్చు. పిల్లలారా, శాస్త్రాల వలన ప్రయోజనం ఇదే.

ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నవాడు ఒక రోజులో మూడు గంటలకన్నా ఎక్కువగా శాస్త్రపఠనానికి వెచ్చించకుండా మిగిలిన సమయాన్ని జప ధ్యానాలలో గడపాలి.

అతిగా శాస్త్రపఠనం చేసినట్లైతే ధ్యానంలో కూర్చోవడం సాధ్యం కాదు. మనసులో లోకులకు బోధించాలన్న కోరిక కలుగుతుంది. “నేను బ్రహ్మము కదా? మరింక ధ్యానం ఎందుకు చేయాలి?” అనే ఆలోచన ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నప్పటికీ మనస్సు అనుమతించదు, లేవటానికి ప్రేరేపిస్తుంది.

పిల్లలారా, జీవిత కాలమంతా శాస్త్రపఠనం చేయడంవల్ల ప్రయాజనమేమిటి? పంచదార రుచి తెలుసుకోవడానికని ఒక బస్తాడు పంచదార మొత్తం ఎవరూ తినరు. ఒక్క చిటికెడు తింటే చాలు.

గాదెలో పడి ఉన్న ధాన్యపు గింజకి తనలోనే సర్వమూ ఉందన్న భావం ఉంటుంది. మట్టి ముందు నేనెందుకు తల వంచాలి అని అది ఆలోచిస్తూ ఉంటుంది. కానీ, బయటకి వచ్చి మొలకెత్తితే, తన నుండి ధారాళంగా ధాన్యం లభిస్తుంది కదా, ఇతరులకు ప్రయోజనకరము కదా అని అలోచించదు. ఇలా గాదెలోనే ఉండిపోవడంవల్ల అది ఎలుకకి ఆహారంగా మాత్రమే అవుతుంది. కేవలం శాస్త్ర పాండిత్యం మాత్రమే ఉన్నవారు, గాదెలో పడి ఉన్న ధాన్యపు గింజ వంటివారు. సాధన లేకుండా వారికి అది సరైన ప్రయోజనం ఎలా చేకూరుస్తుంది? చిలుక లాగా “నేను బ్రహ్మము, నేను బ్రహ్మము” అని అంటూ కూర్చోగలరంతే.

 

అమృతపురి చరిత్రలో అనేక అపూర్వమైన జంతువులు ఉన్నాయి. అమ్మ యొక్క సాధనా కాలంలో అనేక జీవులు సాయం చేశాయి: అమ్మ ధ్యానం చేసేటప్పుడు అమ్మ ముందు ఆహారం పడవేసిన గ్రద్ద; అమ్మ కోసం ఎవ్వరూ తాకని ఆహార ప్యాకెట్లను తన నోట కరుచుకుని తీసుకువచ్చిన కుక్క; అమ్మకు పాలు ఇవ్వటానికి తాడు తెంపుకుని వచ్చిన ఆవు మొదలైనవి. జంతు రాజ్యానికి చెందిన అనేక ఇతర అసాధారణ జీవాలు అనేక సంవత్సరాలు తరబడి అమృతపురిలో కనిపించేవి. వాటిలో గుడికి వచ్చే నెమళ్ళు, భజనకి వచ్చే కాకులు, స్నేహపూర్వక సర్పాలు, పిల్ల ఏనుగులు, కోతుల జంట, వెజ్ బర్గర్‌లు ఇష్టపడే గ్రద్దలు, అసాధారణ ఎలుకలు, వివిధ పిల్లులు, కుక్కలు ఉన్నాయి.

చాలా సంవత్సరాల పాటు, కైజర్ అనే ఒక ఎర్రని కుక్క ఆశ్రమానికి కాపలా కాస్తుండేది అన్ని దొంగల నుండి, అవి రెండు కాళ్ళవయినా లేదా నాలుగు కాళ్ళవయినా. వాడు తాగుబోతైనా లేదా కీడు చేద్దామనే ఉద్దేశ్యంతోనైనా ఆశ్రమ సరిహద్దులు దాటి లోపలికి వస్తే, ఆ వ్యక్తి బాధలు దేవుడికే ఎరుక. వేలాదిమంది ఉండే సమూహంలో కూడా కైజర్ ఆ వ్యక్తిని కనిపెట్టి వాడి దగ్గరికి వెళ్ళి, మొరుగుతూ వాడిని ఎటూ కదలనిచ్చేది కాదు.

 

Amma and Tumban looking at each other

 

ఈ విధంగా ఆశ్రమానికి కాపలా కాస్తూ ఎంతో విశ్వాసంగా ఉండేది. అది ఒక రోజు అనారోగ్యంతో మరణించింది. కైజర్ గతించిన తరువాత రెండు సంవత్సరాల వరకు ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఒక రోజు, ఆశ్రమ పరిసరాల చుట్టూ తిరుగుతూ ఉండే  ఓ రంగురంగుల చిన్న కుక్క ఒకటి, ఒక దహనకాండ సమయంలో అమ్మ ముందుకు వచ్చి నుంచుంది. తన దృష్టిని ఆకర్షించటంతో, అమ్మ దానిని దగ్గరకు పిలిచారు. వెంటనే తోక ఆడించుకుంటూ వచ్చి అమ్మ ప్రక్కనే కూర్చున్నది. వాడి పేరు తుంబన్ (కన్నడ భాషలో ‘తుంబ’ అనగా ‘సమృద్ధి’ లేక ‘అనేకమైన’) అని ప్రక్కనున్న వాళ్ళు చెప్పారు అమ్మకు. అమ్మ వాడిని ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి, వాడు ఆశ్రమంలో వెలిగిపోతున్నాడు. ఆశ్రమ పోలీసు అయ్యాడు. వాడికి మెడ పట్టీ, స్నానాలు మరియు పేలను అరికట్టే పొడి ఇవ్వబడ్డాయి.

తుంబన్ తన విధులను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తాడు. ఇంతకు ముందు కైజర్ చేసినట్టుగా, ఆశ్రమం చుట్టూ గస్తీ తిరుగుతాడు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే  పట్టుకుంటాడు, అది మనుష్యులైనా లేక జంతువులైనా. అర్థరాత్రి వచ్చే వాహనాలకు ఎదురు వెళ్తాడు. అతిథులు అర్థరాత్రిలో ఆశ్రమానికి వచ్చినప్పుడు, తుంబన్ వారిని ఆహ్వానపూర్వకంగా పలుకరిస్తాడు, వారితో పాటు వసతి గృహం ఆఫీసు దాకా, ఆ తరువాత వారికి కేటాయించిన భవనం వరకు వెళ్తాడు. సామానులు మాత్రం మోయడం లేదంతే …

ధ్యానించటానికి అమ్మ బీచ్‌కి వచ్చినప్పుడు తుంబన్ తరచుగా అమ్మ ముందుకు వెళ్ళి కూర్చుంటాడు. ప్రార్థన చేస్తున్నట్టు లేక ప్రణామం చేస్తున్నట్టు పాదాలను ఇసుకలో ముందుకు చాచి, తరువాత కూర్చుంటాడు. అప్పుడప్పుడు అమ్మ వాడిని అడుగుతుంది, ధ్యానం చేయటానికి వచ్చావా అని. దగ్గరగా రమ్మని అమ్మ అప్పుడు వాడిని పిలుస్తుంది. ఆ విధంగా వాడు అమ్మ ప్రక్కనే, పీఠం మీద, “ధ్యానం” చేయటం మొదలుపెట్టాడు. వాడు కూర్చోవటానికి వాడికి ఒక సొంత ఆసనం కూడా ఏర్పాటు చేశారు.

 

Tumban sits next to Amma on the peetham

 

అమ్మ దర్శనం ఇచ్చే సమయంలో, అప్పుడప్పుడు దర్శనానికి తుంబన్ కూడా వస్తాడు. అమ్మ వాడిని పలకరించి, ఏమన్నా తినిపిస్తారు. అప్పుడు వాడు అమ్మ ప్రక్కనే కొంచెం సేపు కూర్చుంటాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాడు అమ్మ లేదా తనకి రోజూ భోజనం పెట్టేవారి దగ్గర తప్ప ఇతరులెవ్వరు పెట్టినా తినడు. వాడికి అత్యంత ఇష్టమైన ఆహారం – వెన్న రాసిన చపాతీలు!

తుంబన్‌కి ఖచ్చితంగా అమ్మతో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. దర్శనం ముగించి అమ్మ లేచినప్పుడు, అమ్మతో పాటు అమ్మ గదికి వెళ్ళటానికి, అంత మంది మధ్యలో కూడా వాడు అమ్మ దగ్గరకి పరిగెత్తి రావడం చూడవచ్చు. అమ్మ తన దగ్గరకి వచ్చే చిన్న పిల్లల మీద ఎక్కువ మమకారం చూపిస్తే, తుంబన్‌కి అసూయ అని చెప్పుకుంటారు.

ఒక రోజు రాత్రి, భజన సమయంలో, తుంబన్ వేదిక క్రింద ఉండే ర్యాంపు మీదకి వచ్చాడు. తోక ఊపుకుంటూ ముందుకీ వెనక్కీ నడిచాడు. చివరికి, అమ్మ ముందు నిలబడి, తోకని చాలా వేగంగా ఆడిస్తూ అమ్మ వంక ఆశగా చూడసాగాడు. అమ్మ వాడిని చూసి నవ్వి, వేదిక మీదకి రమ్మన్నట్టు చెయ్యి ఊపారు. ముద్దొచ్చేట్టు ఒక్క గంతులో, అమ్మ పాదాల దగ్గరకి చేరి చక్కగా కూర్చున్నాడు. వాడి ప్రవర్తన ఎంతో చక్కగా సరైన విధంగా ఉందని అమ్మ అందరి ముందు వాడిని పొగిడారు.  వేదిక మీదకి వచ్చే చనువు తీసుకోవటానికి ముందు వాడు అమ్మ ఆహ్వానం కోసం ఎదురు చూశాడు!

అమ్మ వాడే భజన పుస్తకాన్ని స్వామీజీ తుంబన్ ప్రక్కనున్న సంగీతం స్టాండ్ మీదపెట్టినప్పుడు, తుంబన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వేదిక నుండి క్రిందకి దూకాడు. ప్రతి ఒక్కరూ దానిని చూసి బాధ పడ్డారు. వాడు అక్కడ కూర్చుని ఉంటే చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది.

కొంచెం సేపు తరువాత, తుంబన్ వేదిక మీదకి తిరిగి వచ్చి, తన స్థానంలో కూర్చున్నాడు. ఈ సారి భజనలు పూర్తి అయ్యేంతవరకు అక్కడే కూర్చున్నాడు. అంతే కాదు, ఆరతి సమయంలో కదలను కూడా కదలలేదు. తిరుగుతున్న దీపజ్వాలకు భయపడలేదు. ఆరతి ఇస్తున్న బ్రహ్మచారి మీద అమ్మ పూలు చల్లినప్పుడు, కొన్ని పూలు వాడి మీద పడ్డాయి. అమ్మ పాదాల ముందు అలాగే ముడుచుకుని ఉండిపోయాడు. దీపశిఖ యొక్క కాంతి వాడి మీద పడి మినుకుమినుకుమంటోంది. వాడు మేల్కొని ఉన్నాడా లేక ఏదన్నా సుందర స్వప్నం కంటున్నాడా? అమ్మకి ఆరతి ఇచ్చినప్పుడు, ఒక కోణంలో, అది అఖండత్వానికి కూడా, సర్వ సృష్టికీ. సాధారణంగా శునక జాతికి మనము ఆరతిని ఇవ్వకపోయినా, అమ్మతో పాటు ఆరతి అందుకుంటున్న ఈ సృష్టి యొక్క ఇతర రూపాన్ని చూడడం ఎంతో సరైనది అనిపించింది.

ఆశ్రమ ఆధ్యాత్మిక దినచర్య పట్ల చిత్తశుద్ధి మరియు సమయపాలన, గురువు పట్ల  విధేయత మరియు భక్తి కల ఒక ఆదర్శ ఆశ్రమవాసి తుంబన్. ఉదయం అర్చనకి క్రమం తప్పకుండా వస్తూ ఉంటాడు: ఒక రోజు పురుషుల ప్రక్కకి వస్తే, మరుసటి రోజు స్త్రీల ప్రక్కకి వస్తాడు. గుడిలో జరిగే ఉపనిషత్తు తరగతులకి, రామాయణ చర్చలకి తప్పకుండా హాజరవుతుంటాడు; ప్రతి మంగళవారం జరిగే ధ్యానంలో పాల్గొంటాడు – అప్పుడప్పుడు అమ్మ దగ్గర నుంచి మధ్యాహ్న భోజన ప్రసాదాన్ని తీసుకోవటానికి కూడా వెళ్తాడు. అమ్మ విదేశ యాత్ర సమయంలో అమ్మ దేవీ భావము వీడియో వెబ్‌క్యాస్టుకి కూడా హాజరవుతుంటాడు తుంబన్! ఈ ప్రదేశాలలో తుంబన్ కూర్చోవటానికని వాడికి ఒక సొంత ఆసనం కూడా ఉంది. దానిమీద తప్ప కూర్చోడు. తుంబన్ యొక్క వైరాగ్యాన్ని, ఆశ్రమం, ఆశ్రమ ధర్మం పట్ల ఉన్న అంకిత భావాన్ని చూసి అమ్మ తుంబన్‌ని ఎప్పుడూ ప్రసంశిస్తారు.

Tumban appearing for Amma's pada-pujaఒక ఓనం పండుగ1 రోజు, తుంబన్ వేదిక మీద పాదపూజ చేయనివ్వకుండా ఒక భక్తుడికి అడ్డు పడిన కథనాన్ని ఒక బ్రహ్మచారి చెప్పాడు. తుంబన్ అమ్మ ముందు ప్రణామము చేస్తున్న విధంగా సాగిలపడ్డాడు. పాద పూజ చేయటానికి ప్రయత్నిస్తున్న భక్తుడిని పదేపదే నిరోధించసాగాడు, పూజా సామాగ్రికి అడ్డు పడుతూ, అక్కడి నుంచి కదలటానికి నిరాకరించాడు. కానీ, అమ్మ వాడిని ప్రక్కకి జరగమని చెప్పిన వెంటనే, తుంబన్ తక్షణమే అమ్మ మాట పాలించాడు.

ఒక రోజు, పెద్ద కుక్క ఒకటి అర్చన హాల్లోకి వచ్చింది. తుంబన్ మొరుగుతున్నా ఏమీ లక్ష్యపెట్టలేదు. వేదికకు దగ్గరగా ఉన్న ఆసనాల మీద పడుకుంది … తుంబన్ చాలా ఆదుర్దా పడ్డాడు. కానీ తనకంటే అది పెద్దదవటంతో ఎదిరించటానికి భయపడ్డాడు. ఆ కుక్కని వెళ్లగొట్టటానికి ఉత్తమ వ్యూహం గూర్చి బాగా ఆలోచించుకుని ఉంటాడు, కొద్ది సమయం తరువాత ఆ వ్యూహరచనకి సిద్ధమయ్యాడు: నెమ్మదిగా పడుకున్న ఆ కుక్క వద్దకు వెళ్ళి, దాని చెవిలో మూత్రం వదిలాడు (!) … వెంటనే పరుగెత్తి పారిపోయాడు, తాను చేసిన పని పట్ల సంతృప్తితో. ఆక్రమణదారుడికి సొంత ఇంట్లో లాగా ఉన్న అనుభూతిని చెడగొట్టటానికి ఇది సరిపోయింది. ఉలిక్కిపడి లేచి, దిక్కులు చూస్తూ, హాలు వదిలి వెంటనే వెళ్లిపోయింది … మరుసటి రోజు మళ్ళీ వచ్చింది, ఆ రోజు కూడా తుంబన్ నుంచి అదే మర్యాదను పొందింది … ఇక ఎప్పుడూ తిరిగి రాలేదు!

తుంబన్ గూర్చి ఎన్నో కథలు ఉన్నాయి. ఒక్కసారే అన్ని కథలూ చెప్పుకోలేము. అనేక ఆశ్రమవాసులకి తుంబన్‌తో ఎన్నో కథలూ, అనుభవాలూ ఉన్నాయి… ఆశ్రమవాసులు బయటకు వెళ్ళి చాలా రోజులు తరువాత తిరిగి వస్తే, గుర్తుంచుకుని పలకరిస్తాడు. రోజూ అర్చనకి వెళ్లే ఆశ్రమవాసులు ఒక రోజు వారి స్థానంలో సమయానికి కనపడకపోతే వారి తలుపు మీద గీరుతూ నిద్ర లేపుతాడు …

తుంబన్ చరిత్ర ఏమిటో, గత జన్మ వృత్తాంతము ఏమిటో, అమ్మతో అంత చనువుగా ఉండటానికి ఏం పుణ్యం చేసుకున్నాడో, అని అబ్బురపడుతూ చెప్పుకుంటారు. కానీ, తుంబన్ ఎవరో అని వ్యాకులత చెందటం కాదు మన పని, మనము ఎవ్వరమో అన్నది కనుక్కోవటమే మన పని! అదే మానవ జన్మ లక్ష్యం కూడా. జంతువులు కూడా మన ఈ అన్వేషణలో ప్రోత్సహిస్తూ, అమ్మతో తమకు గల బాంధవ్యం ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ, స్ఫూర్తినిస్తున్నాయి.

 

– ఆంగ్ల మూలము: సాక్షి

 

1  మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి ఎలా పెద్ద పండుగో, కేరళీయులకు ఓనం పెద్ద పండుగ.

 

అందరిలోనూ ఉన్న ఆత్మే నాలోనూ ఉన్నది. ఏదీ నా నుండి వేరుగా లేదు. వేరొకరి దుఃఖమూ, కష్టమూ నావే. ఇది అనుభూతిలోకి తెచ్చుకుని అర్థం చేసుకున్నవాడే ఙ్ఞాని.

జన్మతః పాడగలిగినవాడికి, సంగీతం నేర్చుకున్న ఒకతనికి మధ్యగల వ్యత్యాసంలాగానే అవతారమూర్తికీ జీవుడికి మధ్య తేడా. జన్మతః సంగీత సంస్కారం ఉన్నవాడు ఒక పాట వింటే, వెంటనే నేర్చుకుంటాడు. వేరొకతను అది నేర్చుకోవటానికి కొంచెం సమయం తీసుకుంటాడు.

సర్వమూ భగవదంశమే అయి ఉండటం చేత అందరూ అవతారమూర్తులే. అయితే, తాను భగవదంశమే అని తెలియక “నేను శరీరాన్ని, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి” అని గర్వించే వాడే జీవుడు.

అవతారమూర్తులకు పూర్ణత్వ బోధము ఉంటుంది. వేరేవారికి అది ఉండదు. పైగా, అవతారమూర్తి ప్రకృతితో ఐక్యమై ఉండుట చేత, మనము వారి మనస్సుని సాధారణమైన మనస్సు అని చెప్పలేము. అన్ని మనస్సులూ వారివే. అంతేకాక, అవతారమూర్తి తానే ఒక విశ్వ మనస్సు. వారు శుధ్ధాశుధ్ధములకు ద్వంద్వాలకు అతీతమయినవారు. భగవంతుడు తానే మానవరూపంలో రావడమే అవతారమంటే.

అవతారమూర్తులకు పరిధి నిర్ణయించలేము. సముద్రములో తేలే మంచుకొండలాంటిది పరబ్రహ్మములో భగవంతుని అవతారము. ఐదో, ఆరో అడుగులుండే ఒక మానవ శరీరములో భగవంతుని శక్తిని పరిమితము చేయటము సాధ్యం కాదు. కానీ భగవంతుడు ఈ అల్ప శరీరం ద్వారా ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి సాధ్యమవుతుంది. అవతారమూర్తి యొక్క రూపములో ఉన్న మహత్వము అదే.

జనులు భగవంతునికి చేరువ కావడానికి అవతారమూర్తులు గొప్పగా సహాయపడతారు. మన కోసమే భగవంతుడు శరీరాన్ని ధరించాడు. యదార్థంలో వారు శారీరులు కారు. మనకు ఆ విధంగా అనిపిస్తుంది.

మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా జనం వారి వెనుకే చేరతారు. సుడిగాలి వెనుక చేరే దుమ్ము ధూళి లాగా జనం ఆకర్షింపబడతారు. వారి శ్వాస ఉచ్ఛ్వాసమూ, వారి శరీరం పైనుండి వీస్తున్న గాలి చాలు లోకానికి మేలు చేయటానికి.

పిల్లలారా, క్రీస్తు శిలువ వేయబడ్డాడు. శ్రీకృష్ణుడు బాణంతో చంపబడ్డాడు. ఇది అంతా యదార్థంగా వారి సంకల్పం చేత మాత్రమే జరిగినవి. వారి సంకల్పానికి వ్యతిరేకంగా వారి సమీపములోకి పోవటం కూడా ఎవరికీ సాధ్యము కాదు. ఎదిరించటానికి వచ్చేవారిని భస్మీకరించగలరు. కానీ వారు అలా చేయలేదు. వారు లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించటానికే శరీరాన్ని ధరించారు. వారు త్యాగం అంటే ఏమిటో చూపించటానికే దిగి వచ్చారు.

సన్యాసి అంటే సర్వసంగపరిత్యాగి అనే. ఏ తప్పునైనా సహించి, తప్పు చేసేవారిని క్షమించి, ప్రేమతో వారిని మంచి దారిన నడిపించే వారే సన్యాసులు. త్యాగమంటే ఏమిటో చూపించేవారే వారు. వారు సదా ఆనందముతో నిండి ఉంటారు. అది బాహ్యవస్తువులపై ఆధారపడడం వలన కాదు. తమలోనే వారు ఆనందాన్ని అనుభవిస్తుంటారు.

పిల్లవాడి చేయిపట్టుకుని నడిచేవాడు, పిల్లవాడిలాగే తప్పటడుగులు వేయకుండా వేగంగా నడిస్తే, పిల్లవాడు క్రింద పడిపోతాడు. అదే విధంగా సాధారణ జనాలను ఉద్ధరింపచేయాలంటే ముందుగా వారి స్థాయికి దిగి వెళ్ళాలి. పైగా, నేను సన్యాసిని అని చెప్పి అహంకారముతో రొమ్ము విరుచుకుని కూర్చోకూడదు ఒక ఆధ్యాత్మిక జీవి. అతడు లోకానికి ఆదర్శంగా ఉండాలి.

శ్రీకృష్ణుడు అన్ని వేషాలు వేశాడు. గోపబాలకుడయ్యాడు, మహారాజయ్యాడు, గృహస్థుడయ్యాడు, దూత అయ్యాడు, రథసారధి అయ్యాడు… తాను రాజునని చెప్పి దూరంగా కూర్చోలేదు. ఒక్కొక్కరి సంస్కారానికి అనుగుణంగా వారితో వ్యవహరిస్తూ, వారికి మార్గదర్శకత్వం ఏ విధంగా చేయాలి, అన్న విషయాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఉన్నవారు మాత్రమే లోకాన్ని ముందుకి నడిపించగలరు.

కాషాయవస్త్రాన్ని ధరించి “నేను సన్యాసిని” అని చెప్పి గర్వించే వారున్నారు కొందరు. అడవి చేమ దుంప మొక్కల్లాంటివారు వాళ్ళు. అడవి చేమ, చేమ దుంప మొక్క లాగే కనిపిస్తుంది. పీకి చూస్తే క్రింద ఏమీ ఉండదు (అడవి చేమకి వేరులో దుంప ఉండదు, మామూలు చేమ లాగా). కాషాయము యొక్క రంగు అగ్ని యొక్క రంగే. దేహత్వభావాన్ని దహించిన వారే ఇది ధరించుటకు యోగ్యులైనవారు.